China: భూమ్మీదనే అత్యంత వేగవంతమైన వాహనం.. పట్టాలెక్కించిన చైనా

  • మాగ్లెవ్ రైలు జర్నీ మొదలు
  • గంటకు 600 కిలోమీటర్ల వేగం
  • రెండున్నర గంటల్లో బీజింగ్ నుంచి షాంఘైకి
  • అదే విమానంలో అయితే 3 గంటల టైం
China Rolled Of Maglev Train Into Production Line

బుల్లెట్ రైళ్లంటే ఠక్కున గుర్తొచ్చేది చైనా. అలాంటి ఆ దేశం ఇప్పుడు భూమ్మీదనే అత్యంత వేగవంతమైన రైలును తయారు చేసి, ఈరోజు ప్రారంభించింది. బుల్లెట్ స్పీడ్ కన్నా వేగంగా దూసుకెళ్లే మాగ్లెవ్ రైలు ఇది.

గంటకు 600 కిలోమీటర్ల వేగంతో ఈ మాగ్లెవ్ రైలు పరుగులు పెడుతుంది. బీజింగ్ నుంచి షాంఘైకి వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండున్నర గంటల్లో చేరుకోవచ్చు. అదే విమానంలో అయితే దాదాపు 3 గంటలు పడుతుంది. అంటే విమానం కన్నా వేగంగా అది ప్రయాణించేస్తుందన్నమాట.

అయితే, మామూలు రైళ్లకు ఇది పూర్తిగా భిన్నమైనది. పట్టాలున్నా.. పట్టాలపై అది పరుగులు తీయదు. పట్టాలకు ఆనకుండా విద్యుదయస్కాంత శక్తితో గాల్లో కొంచెం ఎత్తులో ఆ రైలు తేలియాడుతుంది. ఆ శక్తితోనే దూసుకెళ్తుంది. ఖింగ్దావ్ లో ఆ రైలును చైనా అభివృద్ధి చేసింది.

వాస్తవానికి ఇంతకుముందు నుంచే చైనాలో మాగ్లెవ్ టెక్నాలజీతో రైళ్లు నడుస్తున్నాయి. అయితే, అవి పరిమిత సంఖ్యలో ఉన్నాయి. అది కూడా కొద్ది దూరమే నడుస్తున్నాయి. షాంఘైలోని విమానాశ్రయం నుంచి సిటీకి ఓ రైలు నడుస్తోంది. ఇప్పుడు జపాన్, జర్మనీ వంటి దేశాలూ మాగ్లెవ్ రైలును అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే, దానికయ్యే ఖర్చు, పట్టాల మౌలిక వసతులే అడ్డంకిగా మారుతున్నాయి.

More Telugu News