Imran Khan: ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఆరెస్సెస్ నేత

  • భారత్ తో చర్చలకు ఆరెస్సెస్ భావజాలం అవరోధంగా మారిందన్న ఇమ్రాన్
  • పాకిస్థాన్ ది విషం చిమ్మే స్వభావమన్న ఆరెస్సెస్
  • పాక్ ప్రాంత నాయకుల వల్లే 1947లో భారత్ రెండుగా విడిపోయింది
RSS fires on Imran Khan

భారత్ తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని... అయితే భారత్ లోని ఆరెస్సెస్ భావజాలం చర్చలకు అవరోధంగా మారిందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఆరెస్సెస్ మండిపడింది. ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలను కప్పిపుచ్చుకోవడానికే ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారని సంఘ్ సీనియర్ నేత ఇంద్రేశ్ కుమార్ విమర్శించారు.

పాకిస్థాన్ ప్రాంత నాయకుల వల్లే 1947లో భారత్ రెండు దేశాలుగా విడిపోయిందని అన్నారు. వాళ్ల విషపూరిత భావజాలం వల్లే బంగ్లాదేశ్ ఏర్పడిందని చెప్పారు. పాకిస్థాన్ ఆవిర్భావమే విషం చిమ్మే స్వభావంతో జరిగిందని అన్నారు. బలూచిస్థాన్, సింధ్ తదితర ప్రాంతాలు వాటి మనుగడ కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాయని చెప్పారు.

శాంతియుతంగా జీవించాలని పాక్ ప్రజలు కోరుకుంటున్నారని... అయితే ఆ దేశ పాలకులు మాత్రం ప్రజలకు భిన్నంగా వ్యవహరిస్తుంటారని ఇంద్రేశ్ కుమార్ అన్నారు. మానవత్వానికి, సోదరత్వానికి వారు వ్యతిరేకంగా ఉంటారని విమర్శించారు. పాక్ పాలకులు శాంతికి దూరంగా, విడిపోయే స్వభావానికి దగ్గరగా ఉంటారని ఎద్దేవా చేశారు. 

More Telugu News