Tamil Nadu: తమిళనాడులో లాక్ డౌన్ పొడిగింపు

  • జులై 19 వరకు లాక్ డౌన్ పొడిగింపు
  • షాపులు రాత్రి 9 వరకు కొనసాగింపు
  • పెళ్లిళ్లకు 50 మంది వరకే అనుమతి
Tamil Nadu Lockdown Extended Till July 19

కరోనా వైరస్ కేసులు స్థిరంగా నమోదవుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. జులై 19 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు తెలిపింది. అయితే ఇదే సమయంలో ప్రజలకు కొంత వెసులుబాటును కల్పిస్తున్నట్టు పేర్కొంది.

షాపులు మరో గంట సేపు అదనంగా తెరుచుకుని ఉంటాయని, రాత్రి 9 గంటలకు మూతపడతాయని ప్రభుత్వం తెలిపింది. రెస్టారెంట్లు, టీ షాపులు, బేకరీలు, రోడ్ సైడ్ ఈటరీలు రాత్రి 9 వరకు ఓపెన్ గా ఉంటాయని చెప్పింది. అయితే 50 శాతం కెపాసిటీకి మించి కస్టమర్లు ఉండరాదని షరతు విధించింది. ఇదే సమయంలో ఇవన్నీ కోవిడ్ ప్రొటోకాల్ ను పాటించాలని చెప్పింది. క్యూలలో సోషల్ డిస్టెన్స్ ఉండాలని తెలిపింది.

పెళ్లిళ్లకు 50 మందికి మించి హాజరు కాకూడదని, అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరు కావాలని షరతు విధించింది. స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, స్విమ్మింగ్ పూళ్లు, జంతు ప్రదర్శనశాలలు మూసి ఉంటాయని చెప్పింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై నిషేధాన్ని కొనసాగించింది. అయితే పాండిచ్చేరికి మాత్రం బస్పు సర్వీసులను ప్రారంభించింది. కోవిడ్ ప్రొటోకాల్ ను పాటిస్తూ స్టేట్, సెంట్రల్ జాబ్స్ టెస్టులను నిర్వహిస్తామని తెలిపింది.

More Telugu News