Facebook: కొత్త ఐటీ నిబంధనల ప్ర‌కారం యూజ‌ర్ల పోస్టుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటోన్న ఫేస్‌బుక్‌!

  • 30 మిలియన్లకు పైగా ఉన్న వివిధ రకాల కంటెంట్ తొల‌గింపు
  • దాదాపు 3 కోట్లకు పైగా యూజర్ల పోస్టుల తొలగింపు
  • ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అభ్యంత‌ర‌క‌ర పోస్టుల‌పై చ‌ర్య‌లు
fb deletes users content

భార‌త ప్ర‌భుత్వం కొత్త ఐటీ నిబంధనలు తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. సామాజిక మాధ్య‌మాల‌న్నీ వాటి ప్ర‌కార‌మే న‌డుచుకోవాల‌ని స్ప‌ష్టం చేయ‌డంతో ఆయా సంస్థ‌లు ఈ మేర‌కు చ‌ర్యలు తీసుకుంటున్నాయి. ఫేస్‌బుక్ కొత్త ఐటీ నిబంధనల ప్రకారం 30 మిలియన్లకు పైగా ఉన్న వివిధ రకాల కంటెంట్‌ను తొల‌గించింది.

తన తొలి నెలవారీ కంప్లయిన్స్‌ నివేదికలో ఈ వివరాలు తెలిపింది. త‌మ‌ తదుపరి నివేదికను ఈ నెల 15న వెల్ల‌డిస్తామ‌ని చెప్పింది. త‌మ‌కు యూజ‌ర్లు చేసిన‌ ఫిర్యాదులతో పాటు వాటిపై తీసుకున్న చర్యల వివరాలు తెలుపుతామ‌ని పేర్కొంది. మే 15 నుంచి జూన్ 15 మధ్య తాము త‌మ సైట్లో 10 రకాల ఉల్లంఘన కేటగిరీల కింద దాదాపు 3 కోట్లకు పైగా యూజర్ల పోస్టులను తొలగించినట్లు తెలిపింది.

అలాగే, ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అభ్యంత‌ర‌క‌ర పోస్టుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. స్పామ్ పోస్టులు 25 మిలియన్లు, హింసాత్మక, గ్రాఫిక్ కంటెంట్ అభ్యంత‌ర‌క‌ర‌ పోస్టులు 2.5 మిలియన్లు, అశ్లీల‌, లైంగిక చర్యలకు సంబంధించిన 1.8 మిలియన్ల కంటెంట్లు ఇందులో ఉన్నాయ‌ని వివ‌రించింది.

అలాగే, ఉగ్రవాద చ‌ర్య‌ల‌ ప్రచారానికి సంబంధించి ల‌క్ష‌కు పైగా పోస్టులు, విద్వేషాలు రెచ్చ‌గొట్టే ప్రసంగాలకు సంబంధించిన మూడు ల‌క్ష‌ల‌కు పైగా పోస్టులు, వేధింపులకు సంబంధించిన ల‌క్ష‌ల‌కు పైగా పోస్టులు ఇందులో ఉన్నాయ‌ని తెలిపింది. భార‌త ఐటీ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆయా సంస్థ‌లు ప్రతి నెలా కంప్లయిన్స్‌ నివేదికలను ప్రచురించాలి. ఫిర్యాదుల వివరాలతో పాటు తీసుకున్న చర్యలను తెల‌పాల్సి ఉంటుంది.

More Telugu News