Nellore District: నెల్లూరు జిల్లాలో దారుణం.. ప్రేమను నిరాకరించిన యువతిని పొడిచి చంపిన యువకుడు

  • యువతి ఇంట్లోనే ఘాతుకానికి పాల్పడిన నిందితుడు
  • యువతిని హత్య చేసిన అనంతరం ఆత్మహత్యాయత్నం
  • పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరుకు తరలింపు
Engineering Girl murdered in Nellore dist over love row

తన ప్రేమను నిరాకరించిన యువతిని దారుణంగా పొడిచి చంపాడో యువకుడు. ఆపై ఆత్మహత్యకు యత్నించాడు. నెల్లూరు జిల్లా గూడూరులో నిన్న జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఉపాధ్యాయులైన సుధాకర్, సరిత దంపతుల కుమార్తె తేజస్విని ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. సుధాకర్ సహచర ఉద్యోగి అయిన చెంచు కృష్ణయ్య కుమారుడు వెంకటేశ్‌‌తో తేజస్వినికి పరిచయం అయింది. అయితే వెంకటేశ్ మాత్రం తేజస్వినిపై ప్రేమను పెంచుకుని విసిగించడం మొదలుపెట్టాడు. ఏడాదిపాటు అతడి వేధింపులు భరించిన తేజస్విని విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో కుమారుడిని చెంచు కృష్ణయ్య బెంగళూరు పంపించివేశాడు.

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మొదట్లో తిరిగి గూడూరు వచ్చిన వెంకటేశ్ తేజస్వినిని మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె ఫోన్ నంబరు కూడా మార్చేసింది. నిన్న ఉదయం తేజస్విని తల్లిదండ్రులు స్కూలుకు వెళ్లారు. ఇంట్లో యువతి, ఆమె తమ్ముడు కార్తీక్ మాత్రమే ఉన్నారు.

ఇదే అదునుగా భావించిన వెంకటేశ్ తన స్నేహితుడితో కలిసి ఉదయం 11 గంటలకు తేజస్విని ఇంటి వద్దకు వెళ్లాడు. వెంకటేశ్ కిందే ఉండి తేజస్విని ఫోన్ నంబరు కనుక్కునేందుకు స్నేహితుడిని పైకి పంపాడు. అతడొచ్చి ఫోన్ నంబరు అడగడంతో అనుమానించిన కార్తీక్ విషయాన్ని తండ్రికి ఫోన్ చేసి చెప్పేందుకు కిందికి వచ్చాడు. గమనించిన వెంకటేశ్ పైకి వెళ్లి స్నేహితుడిని కిందికి పంపి పదునైన చాకుతో తేజస్విని గొంతులో పొడిచాడు. ఆపై మెడకు చున్నీ బిగించి చంపేశాడు.

కుమారుడి ద్వారా విషయం తెలుసుకున్న తండ్రి సుధాకర్ వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి విషయం చెప్పారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే సుధాకర్ ఇంటికి చేరుకున్నారు. మూసి ఉన్న గది తలుపులను బలవంతంగా తెరిచి లోపలికి వెళ్లారు. రక్తపు మడుగులో పడి వున్న తేజస్వినిని, కిటికీకి చీరతో ఉరి వేసుకున్న స్థితిలో ఉన్న వెంకటేశ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

అయితే, తేజస్విని అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. వెంకటేశ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. యువతి తండ్రి సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు వెంకటేశ్, అతడి తండ్రి చెంచు కృష్ణయ్య, నిందితుడి స్నేహితుడిపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News