Kesineni Nani: కేసీఆర్, జగన్ ఇద్దరూ తోడు దొంగలు: కేశినేని నాని

  • రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న వాటర్ వార్ పెద్ద డ్రామా
  • ప్రజలను కేసీఆర్, జగన్ పిచ్చోళ్లను చేస్తున్నారు
  • ఆస్తులను కాపాడుకోవడానికి కేసీఆర్ తో కలిసి జగన్ డ్రామాలు ఆడుతున్నారు
Kesineni Nani fires on Jagan and KCR

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం ముదురుతోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైనే కాకుండా, ఆయన తండ్రి వైయస్సార్ పై కూడా తెలంగాణ మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందిస్తూ, ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఇద్దరూ తోడు దొంగలేనని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న వాటర్ వార్ పెద్ద డ్రామా అని చెప్పారు. ఏపీ ప్రజలను జగన్, తెలంగాణ ప్రజలను కేసీఆర్ పిచ్చోళ్లని చేస్తూ ఆడుకుంటున్నారని విమర్శించారు. హైదరాబాదులో ఉన్న ఆస్తులను కాపాడుకునేందుకు కేసీఆర్ తో కలిసి జగన్ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.

గత ఎన్నికల తర్వాత ఇద్దరు సీఎంలు కౌగిలించుకుని, బొకేలు ఇచ్చుకుంటే... రెండు రాష్ట్రాలకు మంచి జరుగుతుందని తాను భావించానని నాని అన్నారు. అయితే, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇరువురూ నాటకాలు ఆడుతున్నారనే విషయం పూర్తిగా అర్థమవుతోందని దుయ్యబట్టారు. ఇక్కడ జగన్ డ్రామాలు ఆడుతున్నారని, హైదరాబాదులో ఆయన చెల్లెలు షర్మిల డ్రామాలు మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. జరుగుతున్న పరిణామాలను గమనించలేనంత పిచ్చోళ్లు జనాలు కాదని అన్నారు. 80 శాతం అభివృద్ధి చెందిన అమరావతిని జగన్ వదిలేశారని... ఇప్పుడు కృష్ణా నది కరకట్టను అభివృద్ధి చేస్తానని చెపుతున్నారని... ఆయనను ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.

More Telugu News