Virat Kohli: ఐసీసీ ర్యాంకుల్లో నాలుగో స్థానం నిలుపుకున్న కోహ్లీ... జడేజా, పంత్ ర్యాంకులు పతనం

  • ఇటీవలే ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్
  • తాజా ర్యాంకులు విడుదల చేసిన ఐసీసీ
  • బ్యాటింగ్ లో అగ్రస్థానానికి ఎగబాకిన విలియంసన్
  • ఆల్ రౌండర్ల లిస్టులో నెం.1 ర్యాంకు కోల్పోయిన జడేజా
Kohli retains fourth spot in ICC Test Batting ranks

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్ విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన 4వ స్థానాన్ని నిలుపుకున్నాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ సారథి కేన్ విలియంసన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటీవల ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో విలియంసన్ ఓ అర్ధసెంచరీ సహా విలువైన పరుగులు సాధించాడు. దాంతో టెస్టు బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ రెండోస్థానానికి పడిపోయాడు. టాప్-10లో రోహిత్ శర్మ ఆరోస్థానానికి చేరుకోగా, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఏడోస్థానానికి పడిపోయాడు.

ఇక టెస్టు బౌలర్ల టాప్-10 ర్యాంకింగ్స్ లో రవిచంద్రన్ అశ్విన్ తప్ప మరో టీమిండియా బౌలర్ కు స్థానం దక్కలేదు. అశ్విన్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా అగ్రస్థానాన్ని కోల్పోయాడు. విండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ టాప్ ర్యాంకుకు చేరుకోగా, జడేజా, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తో సంయుక్తంగా రెండోస్థానంలో ఉన్నాడు. అశ్విన్ ఆల్ రౌండర్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

More Telugu News