Telangana: రేపటి నుంచి అంతర్రాష్ట్ర సర్వీసులు నడపనున్న తెలంగాణ ఆర్టీసీ

  • తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత
  • పూర్తిస్థాయిలో బస్సు సర్వీసులు
  • ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకూ బస్సులు
  • ఆయా రాష్ట్రాల్లో సడలింపులకు అనుగుణంగా బస్సులు
Telangana state RTC set to run inter state services to AP and Karnataka

తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేసిన నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలకు బస్సులు తిప్పాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. రేపటి నుంచి అంతర్రాష్ట్ర సర్వీసులు నడపనున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇంకా కర్ఫ్యూ ఆంక్షలు ఉండడంతో, ఆయా రాష్ట్రాల్లో సడలింపులకు అనుగుణంగా బస్సులు తిప్పాలని తెలంగాణ ఆర్టీసీ భావిస్తోంది. ఏపీకి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ప్రాంతంలో... కర్ణాటకకు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు బస్సులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. బెంగళూరులో కరోనా వ్యాప్తి ఉన్నందున కర్ణాటకలోని ఇతర ప్రాంతాలకు తెలంగాణ బస్సులు నడపనున్నారు.

అయితే, కర్ణాటకలో వారాంతాల్లో లాక్ డౌన్ ఉండడంతో శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు తెలంగాణ నుంచి బస్సులు తిరగవు. ఇక, ఏపీ విషయానికొస్తే... తెలంగాణకు తిరిగి ఎప్పుడు చేరుకున్నా ఫర్వాలేదు కానీ... ఏపీలోని ప్రాంతాలకు కర్ఫ్యూ లేని సమయంలో బస్సులు చేరుకునేలాగా షెడ్యూల్ రూపొందించారు.

More Telugu News