Pearl V Puri: ఐదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన హిందీ బుల్లితెర నటుడు పురికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్!

  • 2019 నాటి కేసులో పురి అరెస్ట్
  •  ఆ వెంటనే బెయిలుపై విడుదలైనట్టు సహనటి ట్వీట్
  • పురి సహా ఐదుగురు నిందితులను జుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతి
Pearl V Puri Sent To Judicial Custody In Rape Case After Karishma Tannas got Bail Post

ఐదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన  హిందీ టెలివిజన్ నటుడు పెర్ల్ పురి (31)కి బెయిలు లభించినట్టు వచ్చిన వార్తలు నిజం కాదని తేలింది. పురికి బెయిలు లభించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ సహనటి కరిష్మా తన్నా సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. అయితే, అది నిజం కాదని ఆ తర్వాత తెలిసింది. ముంబై సమీపంలోని వసాయి కోర్టు నిందితుడు పురిని 14 రోజుల జుడీషియల్ కస్టడీకి పంపింది. ఈ కేసులో అతడితోపాటు అరెస్ట్ అయిన మరో ఐదుగురిని కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు వారికి రెండు వారాల కస్టడీకి అనుమతి ఇచ్చింది. పురి మెడకు నల్లని మాస్క్ వేసి కోర్టుకు తరలిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 2019లో ఓ బాలికపై అత్యాచారం చేసినట్టు పురిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో శుక్రవారం   రాత్రి ముంబై పోలీసులు పురిని అరెస్ట్ చేశారు. ‘నాగిన్3’, ‘బేపనాహ్ ప్యార్’, ‘ఫిర్‌భీ నా మానే బద్‌ తమీజ్ దిల్’ వంటి సీరియళ్లతో పురి పాప్యులర్ అయ్యాడు.

అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పురికి సహనటులతోపాటు టీవీ సీరియళ్ల నిర్మాత ఏక్తా కపూర్ అండగా నిలిచారు. అతడు అమాయకుడని, అన్యాయంగా అతడిని ఈ కేసులో ఇరికించారని ఏక్తాకపూర్, హస్సానందానీ, డిసౌజా తదితరులు పేర్కొన్నారు.

పురికి వ్యతిరేకంగా బాలిక తండ్రి చేసిన కుట్రే ఇదని, ఈ విషయాన్ని బాలిక తల్లి తనతో  స్వయంగా చెప్పిందని ఏక్తా కపూర్ పేర్కొన్నారు. పురి జెంటిల్మన్ అని, నిరాధార ఆరోపణలు వద్దని సహనటులు హస్సానందానీ, డిసౌజాలు పేర్కొన్నారు.

More Telugu News