Unlock: అన్ లాక్ ప్రక్రియపై తొందరపాటు వద్దు: ఐసీఎంఆర్

  • రాబోయే థర్డ్ వేవ్ గురించి కూడా ఆలోచించాలని హెచ్చరిక
  • చాలా నెమ్మదిగా అన్ లాక్ ప్రక్రియను కొనసాగించాలని సూచన
  • రాష్ట్రాలకు మూడు సూచనలు చేసిన ఐసీఎంఆర్ చీఫ్
ICMR warns on unlock process

సెకండ్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహమ్మారి వ్యాప్తిని నిలువరించేందుకు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్లు లేదా కర్ఫ్యూలను అమలు చేస్తున్నాయి. అయితే కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టగానే... కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ కు స్వల్పంగా సడలింపులు ఇస్తూ అన్ లాక్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

అన్ లాక్ గురించి ఆలోచిస్తున్న పాలకులు... రాబోయే థర్డ్ వేవ్ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఐసీఎంఆర్ సూచించింది. తొందరపాటుగా కాకుండా చాలా నెమ్మదిగా అన్ లాక్ ప్రక్రియను కొనసాగించాలని తెలిపింది.

ఈ సందర్భంగా ఐసీఎంఆర్ చీఫ్ డాక్టర్ బలరామ్ భార్గవ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలకు మూడు సూచనలు చేశారు. అన్ లాక్ కు వెళ్లే సమయంలో అంతకు ముందు వారంలో కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉండాలని చెప్పారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 45 ఏళ్లకు పైబడిన వారిలో 70 శాతం కన్నా ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ జరిగిందా? అనే విషయాన్ని పరిశీలించాలని సూచించారు. కరోనా కట్టడి విషయంలో ప్రజల ప్రవర్తనలో మార్పు వచ్చిందా? అనే విషయాన్ని కూడా పరిశీలించాలని చెప్పారు.

More Telugu News