Anand Mahindra: ప్రపంచానికి అణ్వాయుధాల కంటే కరోనా వైరస్ ఎక్కువ నష్టాన్ని మిగిల్చింది: ఆనంద్ మహీంద్రా

  • కరోనా ఎక్కడ పుట్టిందనే విషయాన్ని మనం ఎప్పటికీ తెలుసుకోలేం
  • ప్రమాదకర పరిశోధనల నిరోధక ఒప్పందం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది
  • 'కరోనా చైనా శాస్త్రవేత్తల సృష్టే' అనే మీడియా కథనాన్ని షేర్ చేసిన మహీంద్రా
Corona damaged more than nuclear weapons says Anand Mahidra

యావత్ ప్రపంచానికి కరోనా వైరస్ తీరని నష్టాన్ని కలగజేసిందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. అణ్వాయుధాల కంటే ఎక్కువ నష్టాన్ని కలిగించిందని చెప్పారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'కరోనా చైనా శాస్త్రవేత్తల సృష్టే' అనే మీడియా కథనాన్ని కూడా ఆయన షేర్ చేయడం గమనార్హం.

కరోనా ఎక్కడ పుట్టిందనే విషయాన్ని మనం ఎప్పటికీ తెలుసుకోలేమని ఆనంద్ మహీంద్రా అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం మాదిరిగానే... జీవాయుధాలు, ప్రమాదకర పరిశోధనల నిరోధక ఒప్పందాన్ని కూడా చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

కరోనా పుట్టి ఏడాదికి పైగా సమయం గడిచిపోయిందని... అయినప్పటికీ ఇంతవరకు మనం దాని మూలాలను కనుక్కోలేకపోయామని బ్రిటన్ పత్రిక 'డైలీ మెయిల్' తెలిపింది. సార్స్ కోవ్-2 వైరస్ ను చైనా శాస్త్రవేత్తలే కృత్రిమంగా సృష్టించారని బ్రిటీష్ ప్రొఫెసర్ అంగూస్ డాల్ గ్లిష్, నార్వే సైంటిస్ట్ బర్గర్ సొరెన్ సెన్ తమ నివేదికలో పేర్కొన్నారని వెల్లడించింది. దీన్ని ల్యాబ్ లోనే పుట్టించారని చెప్పడానికి అవసరమైన ప్రత్యేక సంకేతాలను కూడా తాము గుర్తించామని వారు చెప్పినట్టు తెలిపింది. మరికొన్ని రోజుల్లో ఈ పూర్తి నివేదిక సైంటిఫిక్ జర్నల్ లో ప్రచురితం కానుంది.

ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 36 లక్షల మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అత్యధిక ప్రాణనష్టం సంభవించిన దేశాల్లో అమెరికా, ఇండియా తొలి స్థానాల్లో ఉన్నాయి.

More Telugu News