Yaas: తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

  • బంగాళాఖాతంలో అల్పపీడనం
  • వాయుగుండంగా మారిందని ఐఎండీ
  • ఉత్తర వాయవ్య దిశగా పయనం
  • రేపటికి తుపానుగా మారే అవకాశం
  • ఈ నెల 26న తీరం దాటనున్న తుపాను
Well marked low pressure in east central Bay of Bengal turns into deprerssion

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ రేపటికి తుపాను (యాస్)గా మారుతుందని, ఆపై రాగల 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారుతుందని ఐఎండీ పేర్కొంది. యాస్ తుపాను ఈ నెల 26వ తేదీ ఉదయం ఒడిశా-పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని తాకుతుందని, సాయంత్రానికి తీరాన్ని దాటి భూభాగంపై ప్రవేశిస్తుందని ఐఎండీ తాజా బులెటిన్ లో వెల్లడించింది.

అయితే, యాస్ తుపాను ప్రభావం ఏపీ, తెలంగాణపై కొద్దిమేర మాత్రమే ఉంటుందని తెలిపింది. రేపు ఉదయం కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఉత్తరాంధ్రలో చెదురుమదురు జల్లులు కురుస్తాయని పేర్కొంది. తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయని, ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉన్నాయని ఐఎండీ తెలిపింది.

More Telugu News