Chandrababu: రఘురామకృష్ణరాజును పోలీసులు వేధించారన్న విషయం సుప్రీంకోర్టులో తేలింది: చంద్రబాబు

  • కోర్టుల తీర్పులపై చంద్రబాబు స్పందన
  • ప్రభుత్వ కస్టడీలో రక్షణ లేదని వ్యాఖ్యలు
  • ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపాటు
  • సుప్రీం ఆదేశాలు పాటించకుండా ఎన్నికలు జరపారని ఆరోపణ
Chandrababu slams AP Govt in recent issues

పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు, రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్  తదితర అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.  అనేక సంఘటనల్లో నిబంధనలు ఉల్లంఘించడాన్ని కోర్టులు స్పష్టంగా తప్పుబడుతున్నాయని తెలిపారు.

పోలింగ్ కు 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిందని వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించకుండా పరిషత్ ఎన్నికలు జరిపారని ఆరోపించారు. కొత్త ఎస్ఈసీని తీసుకువచ్చి ఆగమేఘాల మీద పోలింగ్ కు తెరలేపారని, నామినేషన్లు వేయనివ్వకుండా ప్రత్యర్థులను బెదిరించారని మండిపడ్డారు. నామినేషన్లు సరిగా ఉన్నవాళ్లవి కూడా తిరస్కరించారని, అహంభావంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని అన్నారు.

ఎస్ఈసీకి సుప్రీంకోర్టు కంటే సీఎం ఆదేశాలే ముఖ్యమా అని ప్రశ్నించారు. ఎన్నికల కోసం రూ.160 కోట్ల ప్రజాధనం వృథా చేశారని ఆరోపించారు. హైకోర్టు తీర్పును ప్రజల్లోకి తీసుకెళతామని చెప్పారు. పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పును ప్రజలంతా చదవాలని సూచించారు. హైకోర్టు తీర్పును వ్యతిరేకించడం దుర్మార్గమేనని అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని రౌడీయిజం చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రఘురామకృష్ణరాజును పోలీసులు వేధించారని సుప్రీంకోర్టులో తేలిందని పేర్కొన్నారు. ప్రభుత్వ కస్టడీలో ఉన్నవారికి రక్షణ లేదని అర్థమవుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.  ఎంపీ రఘురామకృష్ణరాజును కాళ్లు కట్టేసి కొట్టారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇలాంటి పరిణామాలతో రఘురామ కుటుంబానికి మానసిక వేదన కలిగించారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రశ్నించిన అందరిపైనా దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్కు అడిగిన వైద్యుడు సుధాకర్ ను వేధించి, క్షోభకు గురిచేశారని ఆరోపణలు చేశారు.

More Telugu News