AP High Court: సుప్రీం తీర్పును ఎస్ఈసీ తమకు కావాల్సిన విధంగా అన్వయించుకున్నారు: హైకోర్టు

  • నీలం సాహ్నీపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
  • సుప్రీం తీర్పుకు విరుద్ధంగా వ్యవహరించారని వ్యాఖ్య 
  • ఎస్ఈసీ వైఖరి ఆమోదయోగ్యం కాదని స్పష్టీకరణ
  • ప్రజాస్వామ్య సూత్రాలకు పూర్తి విరుద్ధమన్న హైకోర్టు 
High Court comments on SEC Neelam Sahni

ఏపీలో ఇటీవల చేపట్టిన పరిషత్ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైకోర్టు ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్నీ వైఖరిపై తీవ్రస్థాయిలో స్పందించింది. సుప్రీం తీర్పును తమకు కావల్సిన విధంగా ఎస్ఈసీ అన్వయించుకున్నట్టు పేర్కొంది. ఎస్ఈసీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎన్నికలకు వెళ్లారని, సుప్రీం తీర్పునకు విరుద్ధంగా నీలం సాహ్నీ వ్యవహరించారని తెలిపింది.

సుప్రీం తీర్పును ఇష్టం వచ్చినట్టుగా అన్వయించుకోవడం ఆమోదయోగ్యం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. నోటిఫికేషన్ అనంతరం 4 వారాల సమయం ఇవ్వాలని సుప్రీం తీర్పులో స్పష్టంగా ఉందని వెల్లడించింది. ఏప్రిల్ 1న నోటిఫికేషన్ ఇచ్చి 10వ తేదీన కౌంటింగ్ ఎలా చేస్తారని ప్రశ్నించింది. ఎస్ఈసీ వైఖరి ప్రజాస్వామ్య సూత్రాలకు పూర్తి విరుద్ధంగా ఉందని పేర్కొంది.

 సుప్రీం తీర్పును అవగాహన చేసుకోవడంలో ఎస్ఈసీ విఫలమయ్యారని విమర్శించింది. ఆంగ్లభాష తెలిసిన సామాన్యుడికీ సుప్రీం తీర్పు అర్థమయ్యేలా ఉందని, కానీ, ఎస్ఈసీ సుప్రీం తీర్పు అర్థం చేసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. ప్రస్తుత ఎస్ఈసీ గతంలో సీఎస్ గానూ పనిచేశారని, ఇలాంటప్పుడు ఎస్ఈసీగా ఆమె అర్హతలపై ఆలోచించాల్సి వస్తుందని తీవ్రస్థాయిలో స్పందించింది.

More Telugu News