Delhi: దయచేసి లాక్ డౌన్ ను పొడిగించొద్దు: కేజ్రీవాల్ కు వ్యాపార సంఘాల వినతి

  • పక్కా ప్రణాళికతో మార్కెట్లను తెరవండి
  • కఠినమైన ఎన్ఫోర్స్ మెంట్ చట్టాలను అమలు చేయండి
  • వర్తక సమాజాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
Trade unions requests Kejriwal not to exdend lockdown

ఢిల్లీలో అమలవుతున్న లాక్ డౌన్ ను పొడిగించవద్దని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను వర్తక సంఘాలు కోరాయి. ఒక పక్కా ప్రణాళికతో మార్కెట్లను తెరవాలని... కఠినమైన ఎన్ఫోర్స్ మెంట్ చట్టాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేజ్రీకి వర్తక సంఘ నేతలు లేఖ రాశారు.

కరోనా తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఢిల్లీలో ఈ నెల 10 వరకు కేజ్రీ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఆ తర్వాత 17 వరకు లాక్ డౌన్ ను పొడిగించింది. అయితే ప్రస్తుత లాక్ డౌన్ ను కూడా మరిన్ని రోజులు పొడిగించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వర్తక సంఘాలు కేజ్రీకి లేఖ రాశాయి.

దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న అన్ని సందర్భాల్లో వర్తకులు ప్రభుత్వాలకు మద్దతుగా నిలిచారని లేఖలో పేర్కొన్నారు. షాపులు మూతపడటంతో వ్యాపారులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని... ఈఎంఐలు, జీతాలు, అద్దెలు, ప్రాపర్టీ ట్యాక్సులు, జీఎస్టీ తదితర చెల్లింపులు చాలా కష్టంగా మారాయని చెప్పారు. వర్తక సమాజాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గతంలో తాము చేసిన విన్నపాలకు కూడా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు కేజ్రీవాల్ మాట్లాడుతూ, కరోనాతో మన పోరాటం ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కఠిన నిబంధనలను సడలించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

More Telugu News