Narendra Modi: పీఎం కిసాన్ 8వ విడత నిధులు విడుదల... ఏపీ మహిళా రైతుతో మాట్లాడిన ప్రధాని మోదీ

  • 9.5 కోట్ల మంది రైతులకు లబ్ది
  • ఒక్కొక్కరి ఖాతాలో రూ.2 వేలు
  • రూ.19 వేల కోట్లు విడుదల చేసిన మోదీ
  • ఏపీ మహిళా రైతు రమకు అభినందనలు
PM Modi talks to AP woman farmer during release of PM Kisan Samman funds

ఏపీలో నిన్న వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల కాగా, నేడు దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రధాని నరేంద్ర మోదీ రూ.19,000 కోట్ల నిధులు విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9.5 కోట్ల మంది రైతులకు వర్తించేలా నగదును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకం ద్వారా ఒక్కోరైతు ఈ విడతలో రూ.2,000 అందుకోనున్నారు.

కాగా, ఈసారి పీఎం కిసాన్ పథకం ద్వారా పశ్చిమ బెంగాల్ రైతులు కూడా లబ్ది పొందనున్నారు. కేంద్రం రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా 3 విడతల్లో నగదు సాయం అందిస్తోంది. రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.

నేడు నగదు విడుదల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి చెందిన రమ అనే మహిళా రైతుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బంజరు భూములను సాగులోకి తీసుకువచ్చి రైతాంగానికి స్ఫూర్తిగా నిలిచారని మోదీ కొనియాడారు. అందుకు రమ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు ప్రభుత్వం ద్వారా లభించిన 4 ఎకరాల భూమిలో ప్రకృతి సేద్యం ద్వారా విభిన్నరకాల పంటలు పండించి లాభాలు ఆర్జించానని రమ వెల్లడించారు. ఆమె విజయగాథను విన్న ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

More Telugu News