Corona Virus: వేడి నీళ్లతో స్నానం చేస్తే కొవిడ్ రాదన్న వార్తలపై ప్రభుత్వం స్పష్టత

  • వేడి నీటితో కరోనా పోదు
  • మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడమే మార్గం 
  • వేడినీటితో ఉపశమనం పొందొచ్చు
Corona wont go with hot water

కరోనా వైరస్‌ను ఇలా నివారించవచ్చంటూ సామాజిక మాధ్యమాల్లో పలు చిట్కాలు, గృహ వైద్యాలు కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతున్న వేలాది చిట్కాల్లో వేడి నీళ్లు ఒకటి. వేడి నీటిని తాగడం వల్ల, వాటితో స్నానం చేయడం వల్ల కరోనాకు అడ్డుకట్ట వేయొచ్చంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ ప్రచారంలో ఎంతమాత్రమూ నిజం లేదని తేల్చి చెప్పింది. ఇది పూర్తిగా వాస్తవ దూరమైన ప్రచారమని స్పష్టం చేసింది.

ప్రయోగశాలలో ప్రత్యేక పద్ధతుల్లో 60-75 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే వైరస్ మరణిస్తుందని పేర్కొంది. అయితే, వేడినీళ్ల వల్ల శరీరానికి ఎంతో కొంత ఉపశమనం లభిస్తుందని పేర్కొంది. వేడినీళ్ల స్నానం వల్ల ఒళ్లు నొప్పులు తగ్గుతాయని, మెదడు ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొంది. కండరాలకు, జాయింట్లకు రక్త సరఫరా అందుతుంది.

గొంతు నొప్పి తగ్గడానికి వేడి నీళ్లలో చిటికెడు ఉప్పు, పసుపు వేసుకుని పుక్కిలించడం వల్ల ఉపశమనం కలుగుతుందని ఆయుష్ శాఖ తెలిపింది. వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలో వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయని, కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని, జీర్ణవ్యవస్థ పెరుగుతుందని పేర్కొంది. అంతేకానీ వేడి నీళ్లు వల్ల కరోనా పోతుందన్న వార్తల్లో నిజం లేదని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంతోపాటు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడం ద్వారా మహమ్మారికి దూరంగా ఉండొచ్చని వివరించింది.

More Telugu News