Kangana Ranaut: ‘తలైవి’పై తప్పుడు ప్రచారం.. క్వీన్​ కంగన వార్నింగ్​!

  • సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ ప్రచారం
  • కథనాలపై స్పష్టతనిచ్చిన కంగనా రనౌత్
  • థియేటర్లలో విడుదల చేశాకే ఓటీటీలోకి అని క్లారిటీ
  • తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలంటూ హెచ్చరిక
Kangana Fires Over Reports Thalaivi Fake News

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అలనాటి హీరోయిన్ జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇందులో టైటిల్ రోల్ పోషించింది. 23వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే, కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతితో చిత్రం విడుదల వాయిదా పడింది.

ఈ నేపథ్యంలోనే సినిమాపై పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. నేరుగా ఓటీటీలోనే విడుదల చేసేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై క్వీన్ కంగనా ఫైర్ అయింది. ఆ వ్యాఖ్యలపై ఆమె స్పష్టతనిచ్చింది.

సినిమా థియేటర్లలో విడుదలైన తరువాతే ఓటీటీలోకి వస్తుందని తేల్చి చెప్పింది. ‘‘తలైవి తమిళ వెర్షన్ హక్కులను అమెజాన్ ప్రైమ్, హిందీ హక్కులను నెట్ ఫ్లిక్స్ లు సొంతం చేసుకున్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని బాలీవుడ్ లోని కొందరు వ్యక్తులు సినిమాను నేరుగా ఓటీటీలోనే విడుదల చేస్తారంటూ కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందరికీ చెప్పేదేంటంటే, సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశాకే ఓటీటీలోకి తీసుకొస్తాం. నిజమేంటో తెలుసుకోకుండా తప్పుడు కథనాలు ప్రచురించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని కంగన హెచ్చరికలు జారీ చేసింది. 

More Telugu News