Yanamala: ఆ 250 బ‌స్సులు ఎవ‌రివి?: య‌న‌మ‌ల‌ రామ‌కృష్ణుడు

  • బ‌స్సుల‌ను వెన‌క్కి పంపామ‌ని డీజీపీ చెప్పారు
  • రాష్ట్రాన్ని దొంగ ఓట్లు- దొంగ నోట్ల‌ రాజ్యంగా వైసీపీ మార్చింది
  • దొంగ‌ల పాల‌న‌లో రాష్ట్రం మొత్తం దొంగ‌ల మ‌య‌మైంది
  • దొంగ ఓట్ల అంశంపై సీఎం జ‌గ‌న్ స‌మాధానం చెప్పాలి
  • మంత్రుల ప్రమేయంతోనే దొంగ ఓట్లు వేయ‌డానికి వ‌చ్చారు
yanamala slams jagan

తిరుప‌తి ఉప ఎన్నిక రోజున వెన‌క్కి పంపామ‌ని డీజీపీ చెప్పిన ఆ 250 బ‌స్సులు ఎవ‌రివ‌ని టీడీపీ నేత‌ య‌న‌మల రామ‌కృష్ణుడు ప్ర‌శ్నించారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఉప ఎన్నిక‌లో దొంగ ఓట్ల క‌ల‌క‌లంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రాన్ని దొంగ ఓట్లు- దొంగ నోట్ల‌ రాజ్యంగా మార్చారని మండిప‌డ్డారు.

రాష్ట్రం మొత్తం దొంగ‌లమ‌య‌మైందని య‌న‌మ‌ల అన్నారు. ఉప ఎన్నిక‌లో దొంగ ఓట్ల కల‌క‌లంపై సీఎం జ‌గ‌న్ స‌మాధానం చెప్పాలని ఆయ‌న డిమాండ్ చేశారు. మంత్రుల ప్రమేయంతోనే దొంగ ఓట్లు వేయ‌డానికి వ‌చ్చారని ఆయన ఆరోపించారు. నిన్న దొంగ ఓట్లు వేయ‌డానికి వ‌చ్చిన వారంతా మంత్రులు పంపిన వైసీపీ కార్య‌క‌ర్త‌లు కాదా? అని ఆయ‌న నిల‌దీశారు.

దొంగ ఓట్లు వేయ‌డానికి వ‌చ్చిన వారంద‌రిపై ఎందుకు కేసులు న‌మోదు చేయ‌ట్లేదు? అని య‌న‌మ‌ల ప్ర‌శ్నించారు. పోలింగ్ రోజు దొంగ ఓటర్ల‌తో బ‌స్సులు తిరుప‌తికి ఎలా వ‌చ్చాయని ఆయ‌న నిల‌దీశారు. కేసులు న‌మోదైన 12 మంది అధికార వైసీపీకి చెందిన వారు కాదా? అని చెప్పారు.

ఉప ఎన్నిక‌ జ‌రిగిన ప్రాంతంలో 144 సెక్ష‌న్ విధిస్తే పంక్ష‌న్ హాళ్ల‌లో, రోడ్ల‌పైకి వేల మంది ఎలా వ‌చ్చారని య‌న‌మ‌ల మండిప‌డ్డారు. ఓట‌మి భ‌యంతోనే ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డారని ఆయ‌న చెప్పారు. తాము చేసిన ఫిర్యాదుల‌పై ఎన్నిక‌ల సంఘం స్పందించాలని చెప్పారు.

More Telugu News