Madhavan: మహేశ్ బాబుకి విలన్ గా తమిళ నటుడు?

  • మహేశ్ తాజా చిత్రం 'సర్కారు వారిపాట'
  • కథానాయికగా నటిస్తున్న కీర్తి సురేశ్
  • విలన్ పాత్రకు ప్రచారంలో పలు పేర్లు
  • తాజాగా మాధవన్ తో సంప్రదింపులు  
Madhavan to play villain for Mahesh Babu

స్టార్ హీరోల సినిమాలకు హీరోయిన్ ఎంపిక.. విలన్ ఎంపిక ఎప్పుడూ పెద్ద సమస్యే. ఓ పట్టాన తెమలదు. ముఖ్యంగా విలన్ పాత్రధారి ఎంపిక మరీనూ. ఆయా హీరోలకు దీటుగా నిలబడగలిగే పర్శనాలిటీ కలిగి ఉండాలి. అందుకే, మనవాళ్లు ఎక్కువగా ఇతర భాషల నుంచి విలన్ పాత్రలకు నటులను ఎంపిక చేస్తుంటారు. ప్రస్తుతం మహేశ్ బాబుకి కూడా అలాగే ప్రముఖ తమిళ నటుడు మాధవన్ ని విలన్ గా ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది.

పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా 'సర్కారు వారిపాట' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. బ్యాంక్ స్కాముల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలిషెడ్యూలు షూటింగ్ ఆమధ్య దుబాయ్ లో జరిగింది. ప్రస్తుతం హైదరాబాదులో సెట్స్ లో తదుపరి షూటింగును కొనసాగిస్తున్నారు.

కాగా, ఇందులో విలన్ పాత్రకు మొదటి నుంచీ రకరకాల పేర్లు వినిపించాయి. అయితే, వారిలో ఎవరూ ఫైనల్ కాలేదు. తాజాగా మాధవన్ తో చిత్రం యూనిట్ సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఈ విషయంలో త్వరలోనే నిర్ణయం ఉంటుందని అంటున్నారు. ఇక ఈ 'సర్కారు వారిపాట' చిత్రంలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది.

More Telugu News