Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర విరాళాల్లో 15 వేల చెక్కులు బౌన్స్​

  • వాటి విలువ రూ.22 కోట్లు
  • రామజన్మభూమి ట్రస్ట్ ఆడిట్ లో వెల్లడి
  • సాంకేతిక సమస్యలు కారణమన్న ట్రస్ట్ సభ్యుడు
  • భక్తులు మళ్లీ విరాళాలివ్వాలని విజ్ఞప్తి
About 15000 Collected Bank Cheques for Ram Temple Donation Bounce

అయోధ్య రామ మందిర విరాళాలకు సంబంధించి వచ్చిన చెక్కులలో కొన్ని బౌన్స్ అయ్యాయి. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాలను సేకరించిన సంగతి తెలిసిందే. వీటిపై శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు చేసిన ఆడిట్ రిపోర్ట్ ప్రకారం.. దాదాపు 15 వేల చెక్కులు బౌన్స్ అయ్యాయని తేలింది. ఆ చెక్కుల విలువ రూ.22 కోట్ల వరకు ఉంటుంది.

బ్యాంకులలో నిధులు లేకపోవడం వల్లగానీ, లేదా ఇతర సాంకేతిక కారణాల వల్లగానీ చెక్కులు బౌన్స్ అయి ఉండొచ్చని ఆడిట్ నివేదికలో ట్రస్ట్ పేర్కొంది. ఆయా బ్యాంకులు దీనికి సంబంధించిన సాంకేతిక సమస్యలను పరిష్కరించే పనిలో ఉన్నాయని, ప్రజలు వీలైతే మళ్లీ విరాళాలు సమర్పించాలని ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా కోరారు. కాగా, బౌన్స్ అయిన చెక్కుల్లో 2 వేలకు పైగా చెక్కులు అయోధ్య నుంచి సేకరించినవే కావడం గమనార్హం.

జనవరి 15 నుంచి ఫిబ్రవరి 17 వరకు విశ్వహిందూ పరిషత్ సభ్యులు విరాళాలను వసూలు చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు రూ.5 వేల కోట్ల విరాళాలు వచ్చాయి. విరాళాలపై ట్రస్ట్ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

More Telugu News