Visakhapatnam District: విశాఖ జిల్లాలో ఆరుగురి దారుణ హత్య.. వెలుగులోకి వచ్చిన కొత్త కోణం!

  • నిందితుడిగా భావిస్తున్న అప్పలరాజు కుమార్తెతో విజయ్ ప్రేమ
  • గతంలో విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన అప్పలరాజు
  • పగ తీరక హత్యకు ఒడిగట్టాడంటున్న కుటుంబసభ్యులు
New twist in Visakha district murder case

విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలం జుత్తాడలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురుని పాశవికంగా హత్య చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పదునైన ఆయుధాన్ని ఉపయోగించి వీరిని హతమార్చారు. ఈ హత్యలకు సంబంధించి కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆస్తి వివాదమే ఈ హత్యలకు కారణమని తొలుత భావించారు. అయితే ప్రేమ వివాహమే ఈ హత్యలకు కారణమని కుటుంబసభ్యులు భావిస్తున్నారు.

కుటుంబసభ్యులు చెపుతున్న వివరాల ప్రకారం... కేసులో నిందితుడిగా భావిస్తున్న అప్పలరాజు కుమార్తెకు, విజయ్ కు ప్రేమ వ్యవహారం నడిచింది. 2018లో మొదలైన ఈ ప్రేమ వ్యవహారం కారణంగా అప్పలరాజు కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే దారుణ హత్యలకు పాల్పడ్డాడని అంటున్నారు. తన కుమార్తెతో విజయ్ చాటింగ్ చేస్తున్నాడని గమనించిన అప్పలరాజు అతనిపై పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దాంతో అప్పట్లో విజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయినప్పటికీ విజయ్ పై, అతని కుటుంబసభ్యులపై అప్పలరాజు పగ పెంచుకుని,  నిన్న రాత్రి ఈ దారుణానికి ఒడిగట్టాడని భావిస్తున్నారు. పోలీసులు, స్థానికులు కూడా ఇదే కోణంలో అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News