Uttarakhand: ఏప్రిల్‌ 30 వరకు కుంభమేళా కొనసాగుతుంది: ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ యంత్రాంగం

  • కరోనా నేపథ్యంలో కుంభమేళా నిర్వహణపై ఊహాగానాలు
  • కొట్టిపారేసిన ప్రభుత్వ యంత్రాంగం
  • మతపెద్దలతో చర్చలేమీ జరగలేదన్న అధికారులు
  • కుదించే ప్రతిపాదనలేమీ లేవని స్పష్టం
Kumbh Mela Will continue as per schedule clears Uttarakhand govt

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో హరిద్వార్‌లో మెగా కుంభమేళా నిర్వహణపై వస్తున్న ఊహాగానాలపై ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ యంత్రాంగం స్పష్టతనిచ్చింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే యథావిధిగా కుంభమేళా జరుగుతుందని హామీ ఇచ్చింది. అలాగే రెండు వారాల ముందుగానే కార్యక్రమాన్ని ముగించే అవకాశం ఉందన్న వార్తల్ని కూడా కొట్టిపారేసింది. ఏప్రిల్‌ 30 వరకు కుంభమేళా జరుగుతుందని స్పష్టం చేసింది.

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం మతపెద్దలతో చర్చలు జరుపుతుందన్న వార్తలు వినిపించాయి. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని కుదించాలని ప్రతిపాదించగా.. అందుకు మతపెద్దలు నిరాకరిస్తున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిపై స్పందించిన అధికారులు అలాంటి చర్చలేమీ జరగలేదని.. కుంభమేళా యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేశారు.

సాధారణంగా మెగా కుంభమేళా జనవరిలో ప్రారంభమై ఏప్రిల్‌ వరకు జరుగుతుంది. కానీ, కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్‌కు వాయిదా వేశారు. ఏప్రిల్‌ 1న ప్రారంభమైన ఈ కుంభమేళా ఏప్రిల్‌ 30 వరకు కొనసాగాల్సి ఉంది. అయితే, కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో మేళాను ముందుగానే ముగించేస్తారన్న వార్తలు వినిపించాయి.

More Telugu News