Etela Rajender: ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ఈటల రాజేందర్

  • 95 శాతం మంది ఇంటి నుంచే చికిత్స పొందుతున్నారు
  • 47 వేల పడకల్లో సగానికి పైగా కరోనా పేషెంట్లకు కేటాయించాం
  • సీరియస్ కేసులను ప్రైవేట్ ఆసుపత్రులు గాంధీ హాస్పిటల్ కు పంపుతున్నాయి
Medical staff should be careful says Etela Rajender

సెకండ్ వేవ్ నేపథ్యంలో కరోనా కేసులు మళ్లీ పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఫస్ట్ వేవ్ సమయంలో 20 శాతం మంది పేషెంట్లు ఆసుపత్రుల్లో చేరారని... సెకండ్ వేవ్ లో 95 శాతం మంది ఇంటి వద్దే ఉంటూ చికిత్స పొందుతున్నారని చెప్పారు.

 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 47 వేల పడకల్లో సగానికి పైగా కోవిడ్ పేషెంట్లకే వాడుతున్నామని తెలిపారు. సీరియస్ కేసులు వస్తే... ప్రైవేట్ ఆసుపత్రులు గాంధీ ఆసుపత్రికి పంపుతున్నాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ధర్నాలు చేయవద్దని కోరారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

ఈటల ఈరోజు గాంధీ, టిమ్స్, కింగ్ కోఠి ఆసుపత్రులను సందర్శించారు. ఆసుపత్రుల్లో ఉన్న ఏర్పాట్లు, ఔషధాల లభ్యత, ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం జిల్లాల వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించడం, వారికి వెంటనే టెస్టులు చేయడం చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కరోనా సోకిన వారు ఎక్కువగా హోమ్ ఐసొలేషన్ లోనే ఉండేలా వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. ఔషధాలు, ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

More Telugu News