Quran: ఖురాన్ నుంచి 26 పద్యాలను తొలగించాలన్న పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు.. పిటిషన్ దారుడికి ఫైన్!

  • ఈ పద్యాలు తీవ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయన్న వసీం రిజ్వీ
  • పిటిషన్ పూర్తిగా అవివేకమైనదన్న ధర్మాసనం
  • వసీం రిజ్వీకి రూ. 50 వేల జరిమానా విధింపు
Supreme court dismisses plea to remove 26 verses from Quran

ముస్లింలకు అత్యంత పవిత్రమైన ఖురాన్ నుంచి 26 పద్యాలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ పూర్తిగా అవివేకమైనదంటూ జస్టిస్ నారిమన్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ హృషికేశ్ లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు, ఈ పిటిషన్ ను దాఖలు చేసిన ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీం రిజ్వీకి రూ. 50 వేల జరిమానా విధించింది.

ఖురాన్ లోని 26 పద్యాలు తీవ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని పిటిషన్ లో రిజ్వీ పేర్కొన్నారు. ఈ పద్యాలు కొందరిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని... అందువల్ల వీటిని ఖురాన్ నుంచి తొలగించాలని కోరారు. ఇస్లాం మతం క్షమాగుణం, సమానత్వం, ధర్మం, సహనంపై ఆధారపడి ఉంటుందని... అయితే, కొందరు వ్యక్తులు ఈ పద్యాలను ఆధారంగా చేసుకుని ఇస్లాంకు తప్పుడు భాష్యాన్ని చెపుతున్నారని తెలిపారు. ఈ పద్యాల వల్ల ఇస్లాం అసలు స్వభావం నుంచి దూరమవుతోందని చెప్పారు. అయితే, ఆయన వాదనతో ఏకీభవించని సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్ ను కొట్టి వేస్తూ, జరిమానా విధించింది .

More Telugu News