Jagan: వాలంటీర్ల‌కు పుర‌స్కారాలు అంద‌జేసిన జ‌గ‌న్.. వారిపై ప్ర‌శంస‌ల జ‌ల్లు

  • సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి సహాయపడుతున్నారు
  • పథకాలను వాలంటీర్లు మారుమూల‌ గ్రామాల్లో ప్ర‌జ‌లకు అందేలా చేస్తున్నారు
  • 97 శాతం మంది 35 సంవత్సరాల వయస్సు లోపు వారే
  • 50 శాతం మంది మ‌హిళ‌లే
jagan praises volunteers

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సేవ‌లందిస్తోన్న వాలంటీర్ల‌పై సీఎం జ‌గ‌న్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. తాము తీసుకొచ్చిన‌ వాలంటీర్ల వ్యవస్థలో ఉత్తమ సేవ‌లందిస్తోన్న వారిని ప్రోత్స‌హించేందుకు సత్కరించే కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో ఈ రోజు జ‌గ‌న్ ప్రారంభించారు. ఉగాది పండుగ నేప‌థ్యంలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో గ్రామ, వార్డు వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డులను ప్ర‌దానం చేసి అభినందించారు.

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ..  సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి సహాయపడే మంచి మనసుల‌తో వాలంటీర్లు ప‌నిచేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. వారికి  హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు. ప్ర‌భుత్వ‌ పథకాలను వాలంటీర్లు మారుమూల‌ గ్రామాల్లో ప్ర‌జ‌లకు అందేలా చేస్తున్నార‌ని ప్రశంసించారు.

వివక్ష ఏమాత్రం చూపించకుండా కులాలు, మతాలు, పార్టీలు, రాజకీయాలకు అతీతంగా వారు ప‌నిచేస్తున్నార‌ని జ‌గ‌న్ తెలిపారు. దాదాపుగా రాష్ట్రంలో 2.60 లక్షల పైచిలుకు వాలంటీర్లు ప్రతి గ్రామ/వార్డు పరిధిలో ప‌నిచేస్తున్నార‌ని, ఇందులో 97 శాతం మంది 35 సంవత్సరాల వయస్సు లోపు వారే ఉన్నార‌ని ఆయ‌న చెప్పారు. వారిలో  53 శాతం మంది మ‌హిళ‌లే ఉన్నార‌ని  తెలిపారు.  

ఉద‌యాన్నే సూర్యుడు ఉదయించక ముందే గ్రామాల్లో అవ్వాతాతల దగ్గరకు వెళ్లి వాళ్లకు పెన్షన్‌ చేతులలో పెడుతున్నార‌ని చెప్పారు. దాదాపు 32 రకాల సేవలకు సంబంధించి ఇప్పటికే వాలంటీర్లు కృషి చేస్తున్నార‌ని జ‌గ‌న్ అన్నారు. బియ్యం కార్డు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు, పెన్షన్, ఇళ్ల స్థలాల పట్టాలు, జగనన్న తోడు, రైతు భరోసా వంటి అన్ని ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేర‌వేయ‌డడంలో కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని చెప్పారు.  

అవినీతి లేకుండా, వివక్షకు తావులేకుండా ఏ కార్యక్రమం చేయడం సాధ్యం కాద‌ని ఇంతకు ముందు రోజుల్లో మాట్లాడుకునే వార‌ని ఇప్పుడు అవినీతికి తావులేకుండా ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని తెలిపారు. సేవా కార్యక్ర‌మాల్లో ఎండ, వాన, చలి ఏవీ లెక్క చేయకుండా వారు ప‌నిచేస్తున్నార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు.

More Telugu News