India: వ్యాక్సిన్ పంపిణీలో వరల్డ్ రికార్డు సృష్టించిన ఇండియా!

  • 85 రోజుల్లోనే 10 కోట్ల డోస్ ల పంపిణీ
  • సరాసరిన రోజుకు 38,93,288 టీకాలు
  • అమెరికాలో 89, చైనాలో 102 రోజులకు ఈ ఘనత
  • కరోనాపై పోరాటంలో మరో అడుగు పడింది
  • మైలురాయిని దాటామన్న ప్రధాని కార్యాలయం
India Reaches Mile stone in Vaccination

ఇండియాలో కొవిడ్ టీకా డోస్ ల పంపిణీ 10 కోట్ల మార్క్ ను అధిగమించింది. ఈ విషయాన్ని వెల్లడించిన కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ, అత్యంత వేగంగా ఈ మైలురాయిని ఇండియా అధిగమించిందని పేర్కొంది. కేవలం 85 రోజుల్లోనే 10 కోట్ల డోస్ లను ప్రజలకు పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 10 కోట్ల డోస్ లను ఇవ్వడానికి అమెరికాకు 89 రోజులు, చైనాకు 102 రోజుల సమయం పట్టిందని గుర్తు చేసింది. ఇదే సమయంలో ప్రధాని కార్యాలయం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేస్తూ, "ఇండియాను కొవిడ్-19 రహితంగా చేసే క్రమంలో ఓ మైలురాయిని అధిగమించాం. కరోనాపై పోరాటంలో మరో అడుగు పడింది" అని పేర్కొంది.

ఇక రోజువారీ టీకా పంపిణీ విషయంలోనూ ఇండియా, మిగతా దేశాలతో పోలిస్తే ముందు నిలిచింది. సరాసరిన రోజుకు 38,93,288 టీకాలను ఇస్తున్నామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారం రాత్రి 7.30 గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం, ఇప్పటివరకూ 10,12,84,282 మందికి టీకాలు ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం ఇండియాలో 45 సంవత్సరాల వయసు దాటిన అందరికీ టీకాను అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనే ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభమైంది. ఇక కరోనా కారణంగా సంభవించిన మరణాల విషయంలోనూ ఇండియా, ప్రపంచంతో పోలిస్తే, అతి తక్కువ మోర్టాలిటీ రేటు (1.28 శాతం)ను నమోదు చేసిందని కేంద్రం వెల్లడించింది.

కాగా, 85 రోజుల వ్యవధిలో యూఎస్ లో 9.20 కోట్ల మందికి, చైనాలో 6.14 కోట్ల మందికి, యూకేలో 2.13 కోట్ల మందికి టీకాను ఇచ్చారు. ఇండియాలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, యూపీ, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో దాదాపు 61 శాతం కేసులు ఈ రాష్టాల నుంచే వస్తున్నాయి. దేశంలో జనవరి 16 నుంచి టీకా పంపిణీ మొదలైన సంగతి తెలిసిందే.

More Telugu News