Corona Virus: కరోనా టీకా కోసం వెళితే.. రేబీస్‌ టీకా వేశారు!

  • ఉత్తరప్రదేశ్‌లో ఘటన
  • ధ్రువీకరించిన జిల్లా కలెక్టరు
  • ఫార్మసిస్ట్‌  సస్పెన్షన్ 
  • లోతైన విచారణకు ఆదేశం
three went for covid vaccine but end up with getting rabies vaccine

ఇటీవల కరోనా టీకా వేయించుకోవడానికి వెళ్లిన ఓ మహిళకు ఒకేసారి రెండు డోసులు ఇచ్చిన వైద్యురాలి నిర్వాకం మరువకముందే మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌ షమ్లీ జిల్లాలో కొవిడ్‌ టీకా కోసం వెళ్లిన ముగ్గురు మహిళలకు రేబీస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చి పంపారు.

వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్‌ జిల్లా షమ్లీ జిల్లాలో 60 ఏళ్లు పైబడిన ముగ్గురు మహిళలు సమీపంలోని కండ్లా సామాజిక ఆరోగ్య కేంద్రానికి కొవిడ్‌ టీకా వేయించుకునేందుకు వెళ్లారు. లైన్‌లో నిల్చొని వ్యాక్సిన్‌ వేయించుకొని ఇంటికి వెళ్లారు. కాసేపటికి ఓ మహిళకు వికారం, కళ్లుతిరగడం వంటి లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు సమీపంలో ఉన్న ప్రైవేటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు.

ఈ క్రమంలో టీకా వేసిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చిన చీటీని పరిశీలించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మరో వీడియోలో అనార్కలీ అనే మహిళ మాట్లాడుతూ.. టీకా వేసేటప్పుడు ఆధార్‌ ఇవ్వమంటారా? అని అడగ్గా.. కుక్కకాటుకు వేసే టీకాకు ఆధార్ అవసరం లేదని చెప్పినట్లు తెలిపారు.

ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ జస్జీజ్‌ కౌర్‌ ధ్రువీకరించారు. 60 నుంచి 70 ఏళ్ల మధ్య వయసులో ఉన్న ఆ మహిళలు పొరపాటున కొవిడ్‌ టీకా ఓపీ లైన్‌కి బదులు జనరల్ ఓపీ వరుసలో నిలబడడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. అయితే, తప్పు వరుసలో నిలబడ్డప్పటికీ.. ఫార్మసిస్ట్ రేబీస్‌ టీకాను ఎలా ఇచ్చారన్న విషయం తేలాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఫార్మసిస్ట్‌ను సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. దీనిపై మరింత లోతైన విచారణకు ఆదేశించామని తెలిపారు. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

More Telugu News