YS Sharmila: రాజకీయాల్లో తొలి అడుగు వేస్తున్నా: ఖమ్మం సభలో వైఎస్ షర్మిల

  • ఖమ్మంలో షర్మిల పార్టీ సంకల్ప సభ
  • భారీగా విచ్చేసిన జనాలు
  • ఉత్సాహంగా షర్మిల ప్రసంగం
  • రాజన్న బిడ్డను అంటూ ఉద్ఘాటన
  • వైఎస్సార్ పాలనను పునఃప్రతిష్టాపన చేస్తామని వెల్లడి
YS Sharmila said she enteres into politics

తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపిస్తున్న వైఎస్ షర్మిల ఖమ్మం పట్టణంలో మొట్టమొదటి బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ సంకల్ప సభ కావడంతో భారీ జనసందోహం కనిపించింది. కాగా షర్మిల ప్రసంగం ఆరంభంలో జనాలకు చేరువలో వేదిక దిగువన మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే అభిమానుల కోలాహలం ఎక్కువ కావడంతో ఆమె వేదిక పైనుంచి ప్రసంగించారు. షర్మిల ప్రసంగం ప్రారంభించకముందే సీఎం, సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. అభిమానుల ఉత్సాహాన్ని చూసి షర్మిల ముఖం వెలిగిపోయింది. ఉద్యమాల గుమ్మం ఖమ్మం అంటూ ప్రసంగం ఆరంభించారు.

పల్లెపల్లె నుంచి వచ్చిన వైఎస్సార్ అభిమానులకు, వేదికపై ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న ప్రతి అన్నకు, ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు, ప్రతి తమ్ముడికి, వైఎస్సార్ ను గుండెల్లో పెట్టుకున్న ప్రతి ఒక్కరికీ మీ రాజన్న బిడ్డ శిరసు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోందని పేర్కొన్నారు.

సరిగ్గా 18 ఏళ్ల కిందట ఇదే ఏప్రిల్ 9న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో వైఎస్సార్ చారిత్రాత్మక పాదయాత్ర ప్రారంభమైందని వివరించారు. ఇప్పుడు అదే ఏప్రిల్ 9న నేను రాజన్న బిడ్డగా రాజకీయాల్లోకి తొలి అడుగు వేస్తున్నానని ప్రకటించారు. అన్యాయాన్ని ప్రశ్నించడానికి పార్టీ అవసరమని షర్మిల ఉద్ఘాటించారు. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్సార్ పాలనను పునఃప్రతిష్ట చేయబోతున్నాం అని వివరించారు.

More Telugu News