Chandrababu: టీడీపీ దెబ్బకు సీఎం జగన్ కూడా ప్రచారానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు: చంద్రబాబు వ్యంగ్యం

  • తిరుపతి ఉప ఎన్నిక బరిలో చంద్రబాబు ప్రచారం
  • శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం
  • తమకు కూడా సమయం వస్తుందని వెల్లడి
  • ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని స్పష్టీకరణ
  • తన కార్యకర్తలే తన సైన్యమని ఉద్ఘాటన
Chnadrababu meeting with Srikalahasti TDP workers

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం నేపథ్యంలో శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ దెబ్బకు సీఎం జగన్ కూడా ప్రచారానికి వస్తున్నాడని ఎద్దేవా చేశారు. "ఇంకొకాయన పుంగనూరు నుంచి వస్తున్నాడు పెద్ద మగాడు... పోతూ ఉంటే మనుషుల్ని తీసుకువచ్చి తొక్కించుకుంటూ వెళతాడట. మాక్కూడా సమయం వస్తుంది...  మీరంతా జిల్లాలోనే ఉంటారు... మీలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టం... ఎక్కడున్నా పట్టుకొచ్చి మరీ మావాళ్ల కోరిక తీరుస్తా. నేను రాజకీయాలు చేస్తుంటే గోలీ కాయలు ఆడుకునే వ్యక్తి వచ్చి ఏదో చేస్తాడంట" అని వ్యంగ్యం ప్రదర్శించారు.

పరిషత్ ఎన్నికల బరిలో టీడీపీ లేకపోయినా రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. వైసీపీ అరాచకాలకు భయపడవద్దని, ఎదురొడ్డి నిలిచే కార్యకర్తలకు భవిష్యత్తులో సన్మానం చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇవాళ జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి పరిగెత్తుకుంటూ తిరుపతి వస్తున్నాడంటే అది మీ చలవేనని టీడీపీ కార్యకర్తల్లో చంద్రబాబు హుషారు నింపే ప్రయత్నం చేశారు. న్యాయం, ధర్మం నిలిపే సైనికులే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, తన కార్యకర్తలే తన సైన్యమని ఉద్ఘాటించారు.

More Telugu News