Corona Virus: క్రికెటర్లకు కరోనా వ్యాక్సిన్... కేంద్రాన్ని కోరనున్న బీసీసీఐ

  • ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్
  • ఇప్పటికే ముగ్గురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్
  • మైదానం సిబ్బందినీ వదలని మహమ్మారి
  • టోర్నీ నిర్వహణపై సందేహాలు
Corona vaccine for cricketers

మరికొన్నిరోజుల్లో ఐపీఎల్ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పలువురు ఆటగాళ్లు, మైదానం సిబ్బంది కరోనా బారినపడడం భారత క్రికెట్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. అక్షర్ పటేల్, దేవదత్ పడిక్కల్, నితీశ్ రాణా వంటి ఆటగాళ్లు కరోనా బాధితుల జాబితాలో చేరారు. వీరిలో నితీశ్ రాణా కోలుకున్నారు. దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య ఉద్ధృతస్థాయిలో నమోదవుతుండడం, ఐపీఎల్ లోనూ కరోనా కలకలం రేగడంతో ఈ పోటీల నిర్వహణపై అనుమాన మేఘాలు అలముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు.

ఈ సమస్యకు పరిష్కారం క్రికెటర్లందరికీ కరోనా వ్యాక్సిన్ ఇప్పించడమేనని అన్నారు. ఈ అంశంలో బీసీసీఐ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సంప్రదించే అవకాశం ఉందని తెలిపారు. కరోనా వైరస్ ఎప్పుడు అంతరించిపోతుందో ఎవరికీ తెలియదని, దీనికి ప్రత్యేకంగా డెడ్ లైన్ అంటూ ఏమీ లేదని రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డారు. ఎవరి పని వాళ్లు చేసుకుంటూ పోవడమేనని, అందరిలాగే క్రికెటర్లకు కూడా వ్యాక్సిన్లు ఇప్పిస్తామని వివరించారు. టోర్నీ నిర్వహణపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, ప్రత్యామ్నాయ వేదికలు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

More Telugu News