YS Sharmila: కేసీఆర్ ను మరోసారి టార్గెట్ చేసిన వైయస్ షర్మిల

  • కేసీఆర్ జిల్లాలో 20 కరవు మండలాలున్నాయి
  • పటాన్ చెరు ప్రాంతంలో కాలుష్యం కోరలు చాస్తోంది
  • దళితుల భూములను లాక్కొంటున్నారు
YS Sharmila targets KCR

తెలంగాణలో కొత్త పార్టీని మరికొన్ని రోజుల్లో ప్రారంభించబోతున్న వైయస్ షర్మిల... ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జిల్లాగా చెప్పుకునే మెదక్ లో 20 కరవు మండలాలు ఉండటం బాధాకరమని అన్నారు. జిల్లాలోని పటాన్ చెరు ప్రాంతంలో కాలుష్యం కోరలు చాస్తోందని విమర్శించారు.

 మల్లన్నసాగర్ కి భూములిచ్చిన రైతులకు న్యాయం జరగలేదని... వారు ఆందోళనబాట పట్టారని అన్నారు. దళితుల భూములను లాక్కొంటున్నారని దుయ్యబట్టారు. మెదక్ జిల్లా వైయస్సార్ అభిమానులతో ఈరోజు ఆమె ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుత పాలనలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని షర్మిల అన్నారు. పాటకు ప్రాణం, విప్లవానికి ఊపిరి పోసిన గద్దర్ పుట్టిన గడ్డ మెదక్ అని చెప్పారు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం మెదక్ నుంచే ప్రారంభమైందని అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల పథకం ద్వారా 5.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని వైయస్ భావించారని చెప్పారు. ఆ ప్రాజెక్టుకు ఇప్పటి పాలకులు ప్రీడిజైన్ చేసి, ఏం చేశారో తెలియదని అన్నారు.

More Telugu News