Children Bank Of India: రూ.2000, రూ.500, రూ.200.. చెత్త ఎత్తే కొద్దీ నోట్ల కట్టలు!

  • ఏపీలోని తాడేపల్లిలో ఘటన
  • 30 కట్టలను చూసి పంచాయతీ కార్మికుల షాక్
  • గ్రామ సచివాలయ సిబ్బందికి సమాచారం
  • ‘చిల్డ్రెన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ముద్రను చూసి నవ్వులు
AP Panchayat Workers Shocked after Finding Currency Bundles

పొద్దున్నే రోడ్లపై పడిన చెత్తను ఊడ్చేందుకు తాడేపల్లిలో పంచాయతీ కార్మికులు డ్యూటీ ఎక్కారు. ఉండవల్లి సెంటర్ లోని ఎస్బీఐ వద్ద చీపుర్లు పట్టి చెత్తను ఓ వైపునకు ఊడ్చి ఎత్తుతున్నారు. ఇంతలో కార్మికులకు ఓ రూ.500 నోటు కనిపించింది. అదృష్టం బాగుందని దానిని తీసి దాచారు. చెత్త ఎత్తే కొద్దీ నోట్లు దొరుకుతూనే ఉన్నాయి. ఏంటా అని మొత్తం చెత్త తీసే సరికి దాదాపు 30 దాకా రూ.2000, రూ.500, రూ.200 నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి.

ఆ నోట్ల కట్టలను చూసి భయపడిపోయిన పంచాయతీ కార్మికులు.. వెంటనే గ్రామ సచివాలయ సిబ్బందికి సమాచారమిచ్చారు. సిబ్బంది వచ్చి ఆ నోట్లను పరిశీలించి చూశారు. దొంగనోట్లు అనుకున్నారు. కానీ, కట్టలన్నింటినీ క్షుణ్ణంగా చూస్తే.. దాని మీద చిల్డ్రెన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫర్ స్కూల్ జోన్ అని రాసి ఉంది. దీంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది.. ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారు. మళ్లీ ఆ ‘పిల్లల నోట్ల’ కట్టలను చెత్తలో వేసేసి డంప్ యార్డుకు పంపించారు.

More Telugu News