Bengaluru: కరోనా సెకండ్ వేవ్ పంజా... బెంగళూరును బెంబేలెత్తిస్తున్న మహమ్మారి!

  • బెంగళూరులో ఒక్క రోజునే 2 వేల కొత్త కేసులు
  • ఈ నెల ప్రారంభంతో పోలిస్తే కర్ణాటకలో 10 రెట్లు పెరిగిన కేసులు
  • ప్రతి రోజు దాదాపు 3 వేల కేసులు నమోదవుతున్న వైనం
Bengaluru Records Steep Rise In Covid Cases

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. మహమ్మారి దెబ్బకు పలు రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. పలు చోట్ల లాక్ డౌన్లు, నైట్ కర్ఫ్యూలు కొనసాగుతున్నాయి. కర్ణాటకపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఇండియన్ ఐటీ హబ్ గా పేరుగాంచిన బెంగళూరులో కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతుండటం ఆందోళనను పెంచుతోంది. నిన్న రాత్రి విడుదలైన డేటా ప్రకారం ఒక్క రోజులోనే బెంగళూరులో ఏకంగా 2 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో, వారం క్రితం బెంగళూరులోని జయానగర్ జనరల్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సదుపాయం కలిగిన 50 బెడ్లను ఏర్పాటు చేశారు. ఇప్పడు ఆ సంఖ్యను 100కు పెంచారు. ప్రస్తుతం దాదాపుగా అన్ని బెడ్లు పేషెంట్లతో నిండిపోయాయి.

కర్ణాటకలో ఈ నెల ప్రారంభంలో ఉన్న కేసులతో పోలిస్తే ప్రస్తుత కేసుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. మార్చి 1, 2, 3 తేదీల్లో రాష్ట్రంలో సగటున 300 కేసులు నమోదు కాగా... ఇప్పుడు ప్రతి రోజు దాదాపు 3వేల కేసులు నమోదవుతున్నాయని రాష్ట్ర ఆరోగ్య, వైద్య విద్య శాఖా మంత్రి కె.సుధాకర్ తెలిపారు. బెంగళూరులో ఎక్కువ కేసులు వస్తుండటం ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు.

పెరుగుతున్న కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటోందని సుధాకర్ చెప్పారు. లాక్ డౌన్ విధించేంతగా పరిస్థితులు ఇంకా దిగజారలేదని తెలిపారు. మరో లాక్ డౌన్ విధించకుండా ఉండాలంటే... ప్రజలందరూ కోవిడ్ నిబంధనలకు తు.చ తప్పకుండా పాటించాలని సూచించారు. కులాలు, మతాలతో సంబంధం లేకుండా వాటికి సంబంధించిన కార్యక్రమాలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

More Telugu News