Pawan Kalyan: పోలవరం ముంపు బాధితుల పట్ల ప్రభుత్వ వైఖరి బాధ కలిగిస్తోంది: పవన్ కల్యాణ్

  • ఏపీకి జీవనాడి పోలవరం అంటూ పవన్ వ్యాఖ్యలు
  • నిర్వాసితుల పట్ల ప్రతిఒక్కరూ కృతజ్ఞత కనబర్చాలని సూచన
  • కానీ ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యలు
  • మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపణ
  • హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని వెల్లడి
Pawan Kalyan fires in AP government

ఏపీకి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన వారి పట్ల అందరూ కృతజ్ఞతా భావం కలిగి ఉండాలని, కానీ పోలవరం నిర్వాసితుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి బాధ కలిగిస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పుట్టిపెరిగిన ఊళ్లను, ఉన్న ఇంటిని, జీవనోపాధిని, సాగు భూమిని వదిలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న గిరిజనులపై ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని అన్నారు.

పోలవరం ముంపు ప్రాంత పరిధిలో ఉన్న తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో అధికారులు నిరంకుశంగా వ్యవహరించిన తీరు, జేసీబీలతో ఇళ్లను కూల్చివేసి, ప్రజలు ఇళ్లలో ఉండగానే విద్యుత్ సరఫరా, ఇతర సదుపాయాలు నిలిపివేయడం దారుణమని పేర్కొన్నారు.  నిర్వాసితుల బాధలను, పరిహారం, పునరావాసం తదితర అంశాల్లో ప్రభుత్వ వైఖరిని జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళతామని స్పష్టం చేశారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే తరలించాలని హితవు పలికారు.

More Telugu News