DNA Test: కుక్క యజమాని ఎవరో డీఎన్ఏ పరీక్షతో తేల్చిన మధ్యప్రదేశ్ పోలీసులు

  • లాబ్రడార్ కుక్కపై యాజమాన్య వివాదం
  • కుక్క నాదంటే నాదని పోలీసులను ఆశ్రయించిన వ్యక్తులు
  • కుక్క తల్లి నుంచి డీఎన్ఏ సేకరణ
  • కుక్క డీఎన్ఏతో పోల్చగా రెండు ఒకటేనని తేలిన వైనం
Madhya Pradesh police decides a dog genuine owner by dna test

మధ్యప్రదేశ్ లో ఓ కుక్కకు అసలైన యజమాని ఎవరో తేల్చేందుకు పోలీసులు డీఎన్ఏ పరీక్ష వరకు వెళ్లాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే... ఓ లాబ్రడార్ కుక్క ఎవరిదన్న విషయంలో కార్తీక్ శివహరే, షాదాబ్ ఖాన్ అనే వ్యక్తుల మధ్య వివాదం నెలకొంది. ఈ ఇద్దరూ ఒకరిపై ఒకరు 2020 ఆగస్టులో హోషంగాబాద్ పీఎస్ లో ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు అడిగితే ఎవరికి వారే ఆ కుక్క మాదే అని చెబుతుండడంతో సమస్య ఎటూ తేలలేదు.

ఆ లాబ్రడార్ జాతి శునకాన్ని పచ్ మడీ ప్రాంతంలో కొనుగోలు చేశానని షాదాబ్ చెప్పడంతో పోలీసుల ఆలోచన డీఎన్ఏ పరీక్షలపైకి మళ్లింది. పచ్ మడీలో షాదాబ్ చెప్పిన చిరునామాకు వెళ్లి ఆ కుక్క తల్లి నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించి, వివాదానికి కారణమైన కుక్క డీఎన్ఏతో సరిపోల్చి చూడగా... రెండూ ఒకటేనని తేలింది. దాంతో షాదాబ్ చెప్పిందే నిజమని నిర్ధారించుకున్న పోలీసులు లాబ్రడార్ కుక్కను అతడికే అప్పగించారు.

ఈ కుక్కల డీఎన్ఏ పరీక్షలు హైదరాబాదులో నిర్వహించారు. అందుకోసం షాదాబ్ కు రూ.50 వేలు ఖర్చయిందట. ఖర్చయితే అయింది గానీ, తన కుక్క తనకు దక్కింది అదే చాలని షాదాబ్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

More Telugu News