Chandrababu: సీఐడీ నోటీసుల‌పై హైకోర్టును ఆశ్ర‌యించిన చంద్ర‌బాబు

  • అమ‌రావ‌తి అసైన్డ్‌ భూముల విషయంలో చంద్ర‌బాబుకు నోటీసులు
  • హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ దాఖ‌లు చేసిన చంద్ర‌బాబు
  • సీఐడీ ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాల్సిందిగా విన్నపం  
chandrababu files petition in high court

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడికి ఇటీవ‌ల‌ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే.  అమ‌రావ‌తి రాజధానిలో అసైన్డ్‌ భూముల విషయంలో విచారణకు సంబంధించి 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇవ్వ‌డంపై చంద్ర‌బాబు ఈ రోజు హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. సీఐడీ న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను స‌వాల్ చేస్తూ ఆయ‌న ఈ పిటిష‌న్ వేశారు.

సీఐడీ న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను ర‌ద్దు చేయాల‌ని చంద్ర‌బాబు త‌ర‌ఫు న్యాయ‌వాదులు హైకోర్టును కోరారు. ఆయ‌న పిటిష‌న్‌ను రేపు విచారించే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు, నేడు త‌మ‌ పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు సీఐడీ నోటీసులపై చ‌ర్చించే అవ‌కాశం ఉంది.  

More Telugu News