Komatireddy Raj Gopal Reddy: నన్ను నాగార్జున సాగర్ బరిలో దిగమని బీజేపీ కోరుతోంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

  • నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి ప్రస్తావన
  • బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందన్న కోమటిరెడ్డి
  • ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడి
  • స్వార్థం కోసం పార్టీ మారనని ఉద్ఘాటన
  • టీఆర్ఎస్ ను ఓడించే శక్తి బీజేపీకే ఉందని వ్యాఖ్యలు
Komatireddy Rajagopal Reddy comments on Nagarjuna Sagar by polls

కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆయన బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు రావడం తెలిసిందే. అయితే, తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ను ఓడించే శక్తి బీజేపీకే ఉందని పునరుద్ఘాటించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు.

బీజేపీలో చేరాలంటూ తనకు ప్రతిపాదనలు వస్తున్న మాట నిజమేనని అంగీకరించారు. నాగార్జున సాగర్ బరిలో దిగాలని బీజేపీ తనను కోరుతోందని వెల్లడించారు. ఒకవేళ తాను బీజేపీలోకి వెళ్లి, సాగర్ బరిలో దిగితే మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి మూడోస్థానమేనని అన్నారు. టీఆర్ఎస్ ను గద్దె దింపడమే తన లక్ష్యమని, అయితే బీజేపీలో చేరే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. స్వార్థం కోసం పార్టీ మారాలని తాను భావించడంలేదని, ప్రజా శ్రేయస్సే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకవేళ ఆయన నాగార్జున సాగర్ బరిలో దిగాలని భావిస్తే మునుగోడులో ఉప ఎన్నిక తప్పదు. అయితే ఇది వాస్తవరూపం దాల్చే అవకాశాలు చాలా తక్కువ అని భావిస్తున్నారు.

More Telugu News