Konda Vishweshwar Reddy: కొత్త పార్టీ పెట్టాలా? లేక వేరే పార్టీలో చేరాలా? అనే విషయంపై అందరితో చర్చిస్తా: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

  • రాజీనామా చేస్తున్నట్టు ఉత్తమ్ కు ఇటీవలే చెప్పాను
  • ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా బయటకు చెప్పలేదు
  • నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు
Will discuss about launching new party with all says Konda Vishweshwar Reddy

చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన భవిష్యత్ కార్యాచరణను ఓ ప్రకటన ద్వారా ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇటీవలే చెప్పానని... ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీకి అన్యాయం జరుగుతుందని, ఇప్పుడే ఆ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని ఆయన కోరారని, ఆయన మాటను గౌరవించి ఎవరికీ చెప్పలేదని అన్నారు.

రెండు, మూడు నెలల్లో అందరినీ కలుస్తానని చెప్పారు. కొత్త పార్టీ పెట్టాలా? లేక మరో పార్టీలో చేరాలా? లేక ఇండిపెండెంట్ గా ఉండాలా? అనే విషయాన్ని అందరితో చర్చిస్తానని తెలిపారు. కాంగ్రెస్ నేతలెవరిపైనా తాను ఒత్తిడి తీసుకురానని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.

మీ వ్యక్తిగత ఆలోచనలపై తనకు గౌరవం ఉందని... మీకు ఏది మంచి అనిపిస్తే అది చేయండని చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములు నాయక్ లకు నష్టం జరుగుతుందనే ఇంతవరకు ఈ విషయాన్ని బయటకు వెల్లడించలేదని అన్నారు. కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాని చెప్పారు.

More Telugu News