Gudivada Amarnath: విశాఖను రాజధానిగా ప్రకటించిన తర్వాత సాధించిన ఘన విజయం ఇది: ఎమ్మెల్యే అమర్నాథ్

  • ఎన్నికల తర్వాత ప్రజలకు చంద్రబాబు మొహం చూపించలేని పరిస్థితి తలెత్తింది
  • రెండు వేళ్లు చూపితే.. రెండు మున్సిపాలిటీలే వచ్చాయి
  • తండ్రీకొడుకుల చేతిలో ఓడిన ఏకైక నేత చంద్రబాబు
This is first victory after announcing Vizag as executive capital says Gudivada Amarnath

టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాలను మానేసి, స్వచ్ఛంద సంస్థను నిర్వహించుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు రెండు వేళ్లు ఊపితే... టీడీపీకి రెండు మున్సిపాలిటీలే వచ్చాయని ఎద్దేవా చేశారు.

విశాఖను పరిపాలనా రాజధానిగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన తర్వాత వచ్చిన తొలి ఫలితం ఇదని అన్నారు. మూడు రాజధానులకు విశాఖ ఎన్నికలు రెఫరెండం అని చెప్పిన మాటలను చంద్రబాబు గుర్తుకు తెచ్చుకోవాలని వ్యాఖ్యానించారు. విశాఖలో వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు ప్రజలకు మొహం చూపించలేని పరిస్థితి తలెత్తిందని అమర్నాథ్ అన్నారు. కుప్పం ప్రజలే చంద్రబాబుకు ఓటు వేయనప్పుడు... ఇతర ప్రాంతాల ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. అప్పుడు రాజశేఖరరెడ్డి, ఇప్పుడు జగన్... తండ్రీకొడుకుల చేతిలో ఓడిన ఏకైక నాయకుడు చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. 

More Telugu News