Chandrababu: ప్రస్తుత ఫలితాలు చూసి నిరుత్సాహ పడనక్కర్లేదు: చంద్రబాబు

  • ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
  • పార్టీ ఘోర వైఫల్యంపై చంద్రబాబు స్పందన
  • పార్టీ కోసం కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని కితాబు
  • ఇదే స్ఫూర్తితో పోరాడదామని పిలుపు
  • భవిష్యత్తులో విజయం మనదేనని ఉద్ఘాటన
TDP Chief Chandrababu comments on Municipal Elections results

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోర వైఫల్యం చెందిన నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రస్తుత ఫలితాలు చూసి నిరుత్సాహపడనక్కర్లేదని కార్యకర్తల్లో నిరాశ, నిస్పృహలు తొలగించే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలని కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని ప్రశంసించారు. కొన్నిచోట్ల ప్రాణాలు పణంగా పెట్టి పార్టీకి అండగా నిలిచారని కొనియాడారు. అధికార దుర్వినియోగం, ప్రలోభాలు ఉన్నా గట్టిగా పోరాడామని వెల్లడించారు.

ప్రజాసమస్యల పరిష్కారం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా సాగుదామని పిలుపునిచ్చారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తే రాబోయే రోజుల్లో విజయం మనదే అని చంద్రబాబు ఉద్ఘాటించారు.

కాగా, 75 మున్సిపాలిటీలకు గాను 73 స్థానాల్లో వైసీపీ విజయం అందుకున్నట్టు తెలుస్తోంది. చిలకలూరిపేట మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ కోర్టు ఆదేశాల మేరకు ఫలితాలు ప్రకటించలేదు. మున్సిపల్ కార్పొరేషన్లలోనూ వైసీపీనే నెగ్గింది. కోర్టు ఉత్తర్వులతో ఏలూరు కార్పొరేషన్ లో కౌంటింగ్ చేపట్టలేదు. ఇక మిగతా 11 కార్పొరేషన్లలో వైసీపీ హవానే సాగింది.

More Telugu News