KTR: ఇంట్లో బ‌య‌లుదేరే ముందు గ్యాస్ సిలిండ‌ర్‌కు న‌మ‌స్కారం పెట్టి వ‌చ్చి ఓటేశాను: కేటీఆర్

  • తెలంగాణ‌లో రెండు ఎమ్మెల్సీ స్థానాల‌కు పోలింగ్
  • ఓటు వేసిన‌ ప్ర‌ముఖులు
  • సమస్యలు పరిష్కరించే అభ్యర్థికే ఓటు వేశాన‌న్న కేటీఆర్‌
ktr casts his vote

తెలంగాణ‌లో రెండు ఎమ్మెల్సీ స్థానాల‌కు పోలింగ్ కొనసాగుతోంది. ప్ర‌ముఖులు ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. హైద‌రాబాద్‌, షేక్‌పేటలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

ఇంట్లో బ‌య‌లుదేరే ముందు గ్యాస్ సిలిండ‌ర్‌కు న‌మ‌స్కారం పెట్టి వ‌చ్చి ఓటేశానని కేటీఆర్ ఈ సంద‌ర్భంగా చెప్పారు. గ్యాస్ సిలిండ‌ర్‌, పెట్రోలు ధ‌ర‌లు పెరిగిపోతున్నాయ‌ని ఆయ‌న ప‌రోక్షంగా చెప్పారు.  

సమస్యలు పరిష్కరించే అభ్యర్థికే తాను ఈ ఎన్నికల్లో ఓటు వేసినట్లు తెలిపారు. ప‌ట్టభ‌ద్రులంద‌రూ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయ‌న అన్నారు. ఆదివారం సెలవుదినమని ఇంట్లోనే ఉండ‌కూడ‌ద‌ని, ప్రతి ఒక్కరూ సాయంత్రం నాలుగు గంటల్లోగా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని పిలుపునిచ్చారు.

కాగా, హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని నీటిపారుదలశాఖ కార్యాలయంలో పోలింగ్‌ కేంద్రంలో నగర మేయర్‌ విజయలక్ష్మి,  షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయంలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్ ఓట్లు వేశారు. కోదాడలో ఎమ్మెల్యే మల్లయ్యాదవ్ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

అలాగే, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కలెక్టర్ అనితా రామచంద్రన్ ఓటు వేశారు. మహబూబాబాద్‌ పట్టణంలో ఎమ్మెల్యే భానోత్‌ శంకర్‌నాయక్‌ దంపతులు ఓట్లు వేశారు. దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్, మిర్యాలగూడ పట్టణంలోని బకల్‌వాడి పాఠశాలలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.


More Telugu News