BJP: ఒడిశా శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం

  • ఆత్మహత్య చేసుకుంటానని ఇదివరకే హెచ్చరించిన ఎమ్మెల్యే
  • నిన్న రెండో విడత సమావేశాలు ప్రారంభం కాగానే ఆత్మహత్యాయత్నం
  • శానిటైజర్ తాగే యత్నం.. అడ్డుకున్న సభ్యులు
BJP MLA Subash Chandra Panigrahi attempts suicide in Odisha Assembly

శాసనసభలో సీరియస్‌గా చర్చ జరుగుతున్న వేళ ఓ బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఒడిశాలో జరిగిందీ ఘటన. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సహకార, పౌరసరఫరాల శాఖ మంత్రి రాణేంద్ర ప్రతాప్ స్వయిన్ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో పోడియం వద్దకు చేరుకున్న బీజేపీ దేవ్‌గఢ్ ఎమ్మెల్యే సుభాష్ పాణిగ్రాహి తన వెంట తెచ్చుకున్న శానిటైజర్ బాటిల్ మూత తీసి తాగే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన ఇతర సభ్యులు ఆయన నుంచి సీసా లాక్కోవడంతో ప్రమాదం తప్పింది.

ధాన్యం కొనుగోలు చేయకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఎమ్మెల్యే ఇది వరకే హెచ్చరించారు. అనుకున్నట్టే ఆత్మహత్యకు యత్నించారు. తన నియోజకవర్గమైన దేవ్‌గఢ్ జిల్లాలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అక్కడి రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని గత నెల 26న అసెంబ్లీలో మాట్లాడుతూ సుభాష్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ధాన్యం కొనుగోలు చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరిస్తున్నారని, ప్రభుత్వం కనుక తక్షణం కొనుగోళ్లు చేపట్టకుంటే తాను కూడా అదే పనిచేస్తానని హెచ్చరించారు. నిన్న రెండో విడత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా ముందుగా హెచ్చరించినట్టు సుభాష్ ఆత్మహత్యాయత్నం చేశారు.

More Telugu News