Beeple: రూ.500 కోట్ల‌కు అమ్ముడుబోయిన డిజిట‌ల్ పిక్ ఇది!

  • అమెరికా ఆర్టిస్ట్ బీపుల్ కొత్త డిజిట‌ల్ ఇమేజ్ ఇది
  • వేలం వేసిన‌ క్రిస్టీ సంస్థ‌
  • భారీ ధ‌ర ప‌లికింద‌ని చెప్పిన క్రిస్టీ
  • అత్యంత విలువైన కళాకారుల్లో బీపుల్ ఒక‌రని ప్ర‌శంస‌
Beeple Sold an NFT for 69 Million at First of its Kind Auction at Christies

అమెరికాలోని ద‌క్షిణ‌ కరోలినా, చార్లెస్టన్‌కు  చెందిన డిజిట‌ల్ ఆర్టిస్ట్ బీపుల్ (అస‌లు పేరు మిక్ వింకెల్మన్) అంద‌రిలా కాకుండా కొత్త‌గా ఆలోచిస్తాడు. ఆయ‌న‌ను ఓ ట్రెండ్ సెట్ట‌ర్‌గా చెప్పుకోవ‌చ్చు. ఆయ‌న సృజ‌నాత్మ‌కత సాధార‌ణ‌మైన‌ది కాదు.. డిజిట‌ల్ రంగంలోనే ఓ కొత్త అధ్యాయానికి శ్రీ‌కారం చుట్టేలా ఆయ‌న వినూత్న రీతిలో త‌న‌లోని నైపుణ్యాల‌ను బ‌య‌ట‌పెడుతున్నారు.‌

ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న పేరు మారుమోగిపోతోంది. ఆయ‌న సృజ‌నాత్మ‌క‌త కెనడాకు చెందిన క్రిస్టీ వేలం సంస్థ‌ను ఆక‌ర్షించింది. ఆ సంస్థ‌లో సాధార‌ణంగా ప్ర‌ముఖ చిత్రాలు, ప్రాచీన‌, చాలా అరుదైన వ‌స్తువుల వంటివి వేలం వేస్తారు. అయితే, మొట్ట‌మొద‌టిసారి ఆ సంస్థ బీపుల్ సృజ‌నాత్మ‌క‌త‌ వ‌ల్ల ఓ డిజిట‌ల్ ఇమేజ్‌ను వేలం వేసింది.

బీపుల్ సృష్టించిన జేపీఈజీ ఫైల్ (డిజిట‌ల్ చిత్రం)ను ఆ సంస్థ వేలానికి ఉంచ‌గా దాని కోసం చాలా మంది పోటీ పడ్డారు. చివ‌ర‌కు అది 500 కోట్ల రూపాయ‌ల (69 మిలియ‌న్ డాల‌ర్లు)కు అమ్ముడుపోయింది. ఈ డిజిట‌ల్ ఇమేజ్‌ను బీపుల్.. తాను రూపొందించిన అనేక ఇమేజ్‌ల క‌ల‌యిక‌తో సృష్టించ‌డం మ‌రో విశేషం.

ఈ విష‌యాన్ని తెలుపుతూ క్రిస్టీ ట్వీట్ చేసింది. ప్ర‌పంచంలో ప్ర‌స్తుతం ఉన్న‌ అత్యంత విలువైన మొద‌టి ముగ్గురు కళాకారుల్లో బీపుల్ ఒక‌ర‌ని ప్ర‌శంసించింది. ఆయ‌న సృష్టించిన ఈ ఒరిజిన‌ల్ డిజిట‌ల్ ఇమేజ్ ను ఎవ‌రు ప‌డితే వారు కాపీ చేసుకోలేరు. దాన్ని కొనుక్కున్న వ్య‌క్తి మాత్ర‌మే దాన్ని పూర్తిస్థాయిలో వాడుకోగ‌ల‌డు. నాన్ ఫంజ‌బుల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ)గా పిలిచే క్రిప్టో గ్రాఫిక్ టోకెన్ ప‌ద్ధ‌తితో ఈ చిత్రాన్ని బీపుల్ రూపొందించాడు.

'ఎవిరిడేస్' పేరిట బీపుల్ కొన్నేళ్లుగా డిజిటల్ చిత్రాలు, వీడియోల‌ను రూపొందిస్తున్నారు. 'ది ఫ‌స్ట్ 5000 డేస్' పేరిట సృష్టించిన ఈ కొత్త‌ డిజిటల్ పిక్ రికార్డు స్థాయి రేటుకు అమ్ముడుపోవ‌డంతో ఆయ‌న పేరు మారుమోగిపోతోంది. 2007 నుంచి ఆయ‌న డిజిట‌ల్ ఇమేజ్‌లు, వీడియోలను రూపొందించ‌డం మొద‌లు పెట్టారు. ప్ర‌తి రోజు క‌నీసం ఒక డిజిట‌ల్ చిత్రాన్ని సృష్టించ‌డం ఆయ‌న‌కు అల‌వాటుగా మారిపోయింది.

కొన్ని నెల‌లుగా  'నాన్ ఫంజ‌బుల్ టోకెన్' ‌కు ఆన్‌లైన్‌లో ఆద‌ర‌ణ పెరిగిపోవ‌డం, అదే ప‌ద్ధ‌తిలో బీపుల్ చిత్రాలు, వీడియోలు రూపొందిస్తుండ‌డంతో ఆయ‌న చిత్రాల‌కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. క్రిప్టో క‌రెన్సీ ప్ర‌పంచంలోనే ఎన్ఎఫ్టీ కొత్త ర‌కం అని చెప్పుకోవ‌చ్చు. కొత్త‌గా ప్ర‌వేశించిన ఈ ప‌ద్ధ‌తికి విప‌రీతంగా డిమాండ్ పెరిగిపోతోంది. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించే చిత్రాల‌ను ఆన్‌లైన్‌లో హ్యాక‌ర్లు ఎవ్వ‌రూ కొట్టేయ‌డానికి వీలుండ‌దు.

ఈ నేప‌థ్యంలో బీపుల్ డిజిట‌ల్ చిత్రాన్ని వేలంలో ద‌క్కించుకున్న వారు  క్రిప్టోక‌రెన్సీ రూపంలో త‌మ‌కు డిజిట‌ల్ వాటెల్ ద్వారా న‌గ‌దును బ‌దిలీ చేయాల్సి ఉంటుంద‌ని క్రిస్టీ సంస్థ పేర్కొంది.  బీపుల్ వేసిన ఈ డిజిట‌ల్ ఇమేజ్ సామాజిక మాధ్య‌మాల్లోనూ బాగా వైరల్ అవుతోంది. ఆయ‌న గతంలో రూపొందించిన ఇమేజ్‌ల‌పై కూడా నెటిజ‌న్లు ఆస‌క్తి క‌న‌బ‌ర్చుతున్నారు.  నాన్ ఫంజ‌బుల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ)కి దీని వ‌ల్ల మ‌రింత ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని అంచ‌నాలు నెల‌కొన్నాయి.

More Telugu News