USA: కరోనా మరణాలు.. ప్రపంచ యుద్ధాలు, వియత్నాం యుద్ధంలో చనిపోయిన వారికన్నా ఎక్కువే: జో బైడెన్​

  • జేబులో చనిపోయిన వారి లిస్ట్ ఉంటుందని కామెంట్
  • మే 1 నుంచి అమెరికన్లందరికీ కరోనా వ్యాక్సిన్
  • స్వాతంత్ర్య దినోత్సవం నాటికి సాధారణ పరిస్థితులు
  • 10 కోట్ల వ్యాక్సిన్లు 100 రోజులు కాదు.. 60 రోజుల్లోనే పూర్తి 
  • తొలిసారి ప్రైమ్ టైమ్ లో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు
All adult Americans to be eligible for Covid 19 vaccination by May 1 says Joe Biden

దేశ స్వాతంత్ర్య దినోత్సవం అయిన జులై 4 నాటికి మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. మే 1 నుంచి ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్  అందుతుందన్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేస్తామన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి శ్వేతసౌధంలో ప్రైమ్ టైమ్ లో మీడియాతో మాట్లాడారు. కరోనాతో చనిపోయిన వారికి నివాళులర్పించారు.

వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరిగేలా మరో 4 వేల మంది సిబ్బందిని నియమిస్తాని ఆయన ప్రకటించారు. ఇప్పటికే 2 వేల మందిని నియమించామన్నారు. కొత్త కరోనా రకాలను కట్టడి చేసేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే వాటి జన్యు క్రమ విశ్లేషణ చేయడంతో పాటు టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుతామని తెలిపారు.

‘‘మీ అందరికీ ఓ నిజం చెబుతున్నా. మళ్లీ మామూలు పరిస్థితులు ఎప్పుడొస్తాయని అడుగుతున్న వారందరికీ ఇదే నా సమాధానం. ప్రస్తుతం మన జీవితాలను బాగు చేసుకోవాలన్నా.. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలన్నా.. చాలా కష్టంతో కూడుకున్నది. కానీ, పరిస్థితులను చక్కదిద్దేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నా. అందులో పురోగతి కనిపిస్తోంది. కచ్చితంగా అతి త్వరలోనే మనం మళ్లీ సాధారణ పరిస్థితులను చూస్తాం’’ అని ఆయన భరోసా ఇచ్చారు.

దేశంలో ఇప్పటిదాకా 5,27,000 మంది చనిపోయారని బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంఖ్య మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, వియత్నాం యుద్ధం, 9/11 దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య కన్నా ఎక్కువేనన్నారు. వాళ్లు చనిపోతే కనీసం ఏడ్చే పరిస్థితి కూడా లేకుండాపోయిందన్నారు. దగ్గరుండి వారి అంత్యక్రియలు చేయలేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. తన జేబులో మహమ్మారితో బలైపోయిన అమెరికన్ల సంఖ్యతో కూడిన ఒక కార్డు ఉంటుందని, ఎప్పటికప్పుడు అందులో వివరాలను చేరుస్తూ ఉంటానని ఆయన వెల్లడించారు.  

వ్యాక్సిన్లపై ఎప్పటికప్పుడు ఫైజర్, మోడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ లతో చర్చిస్తూనే ఉన్నామని ఆయన తెలిపారు. త్వరలోనే కోట్లాది డోసుల వ్యాక్సిన్లు అందుతాయని చెప్పారు. అధికారం చేపట్టిన తొలి వంద రోజుల్లో 10 కోట్ల డోసుల వ్యాక్సిన్లను జనానికి వేయాలన్న లక్ష్యాన్ని తాను పెట్టుకున్నానని, దాదాపు ఆ లక్ష్యాన్ని చేరుకుంటున్నామని ఆయన చెప్పారు.

ఇంకా చెప్పాలంటే తాను అధికారం చేపట్టి 60 రోజులయ్యే నాటికే ఆ లక్ష్యం పూర్తవుతుందన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత సులభం చేయడానికి ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ ను ఏర్పాటు చేస్తామని, ఎక్కడ, ఎప్పుడు వేయించుకోవాలో అందులో వివరాలు పొందుపరుస్తామని ఆయన ప్రకటించారు.

More Telugu News