Asaduddin Owaisi: ఏపీలో బీజేపీ సైలెంట్ గా దూసుకుపోతోంది: ఒవైసీ

  • ఏపీలో మున్సిపల్ ఎన్నికలు
  • పోటీ చేస్తున్న ఎంఐఎం నేతలు
  • ప్రచారానికి వచ్చిన పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ
  • కర్నూలు జిల్లా ఆదోనిలో సభ
  • బీజేపీని అడ్డుకోకపోతే జగన్ కు కష్టాలేనని వెల్లడి
Asaduddin Owaisi comments on BJP

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతుదారుల తరఫున ప్రచారం చేసేందుకు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కర్నూలు జిల్లా అదోనిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ, ఏపీలో హిందుత్వవాదం వేళ్లూనుకుంటోందని అన్నారు. హిందుత్వవాద బీజేపీని నిలువరించకపోతే రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వానికి కష్టాలు తప్పవని అభిప్రాయపడ్డారు. ఏపీలో జరుగుతున్న దేవాలయాలపై దాడులు వెనుక ఉన్నది హిందుత్వవాదులేనని ఒవైసీ ఆరోపించారు.

ఏపీలో సైలెంట్ గా దూసుకెళుతున్న బీజేపీ... భవిష్యత్తులో చంద్రబాబును ఇంటికే పరిమితం చేయాలని ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కరోనా వ్యాప్తికి తబ్లిగీ జమాత్ కారణమని, ముస్లింలే కారకులని ప్రచారం చేశారని మండిపడ్డారు. కరోనా భారత్ లోనే కాదని ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని వెల్లడించారు. డయాబెటిస్, బీపీ, హృదయ సంబంధ వ్యాధులు కిడ్నీ వ్యాధులు కూడా ముస్లింలలోనే ఉన్నాయా?... మిగతావారిలో లేవా? అంటూ ప్రశ్నించారు.

More Telugu News