KCR: యాదాద్రి ఆలయంలోకి వస్తే వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలగాలి: అధికారులకు సీఎం కేసీఆర్ సూచనలు

  • యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్
  • నిర్మాణ పనుల పరిశీలన
  • అధికారులను అడిగి తెలుసుకున్న వైనం
  • సీఎం వెంట ఆలయ స్థపతి ఆనందాచారి వేలు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి
CM KCR visits Yadadri shrine

తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి క్షేత్ర అభివృద్ధిని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. భారీ వ్యయంతో ఇక్కడ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు సూచనలు చేశారు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోకి వచ్చిన భక్తులు వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతికి లోనయ్యేలా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. దూరం నుంచి చూసినా గానీ మూల విరాట్టుకు జరిగే సేవలు కనిపించాలని అన్నారు. విద్యుద్దీపాల వెలుగులో ఆలయం వెలిగిపోవాలని, అవసరమైన చోట లిఫ్టుల ఏర్పాటు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.

కాగా, సీఎం కేసీఆర్ పర్యటన సమయంలో ఆలయ స్థపతి ఆనందాచారి వేలు, సినీ ఆర్ట్ డైరెక్టర్, ఆలయ డిజైనర్ ఆనంద్ సాయి కూడా ఉన్నారు. సీఎం వారిని అడిగి నిర్మాణ పనుల గురించి వివరాలు తెలుసుకున్నారు. అంతకుముందు ఆయన లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పురోహితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

యాదాద్రి ఆలయ ప్రాజెక్టు వ్యయం అంచనాలు రూ.1,200 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.850 కోట్లు ఖర్చయినట్టు అధికార వర్గాలంటున్నాయి.

More Telugu News