Police: నిరసన ప్రదర్శనకు అనుమతి లేదన్న విషయం విపక్ష నేత చంద్రబాబుకు నిన్ననే తెలియజేశాం: తిరుపతి అర్బన్ ఎస్పీ

  • రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు
  • వివరణ ఇచ్చిన పోలీసు అధికారులు
  • తిరుపతిలో నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని స్పష్టీకరణ
  • కోడ్ అమల్లో ఉందని వెల్లడి
  • పైగా శ్రీవారి భక్తులకు ఇబ్బందులు ఎదురవుతాయని వివరణ
Tirupati Urban SP clarifies why police stops Chandrababu in Renigunta airport

ఏపీ విపక్షనేత చంద్రబాబును చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో తాము ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందో తిరుపతి అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు వివరించారు. తిరుపతిలో నిర్వహించ తలపెట్టిన నిరసన ప్రదర్శనకు అనుమతి లేదన్న విషయాన్ని చంద్రబాబుకు తాము నిన్ననే తెలియజేశామని వెల్లడించారు. అయినప్పటికీ నిరసనలో పాల్గొనేందుకు చంద్రబాబు వచ్చారని తెలిపారు.

బస్టాండు సమీపంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగాలని భావించారని, అయితే అక్కడ నిరసన తెలిపితే తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు తీవ్ర ఆటంకంగా ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. పైగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ధర్నా వద్దంటూ టీడీపీ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చామని వివరించారు.  కోడ్ అమల్లో ఉన్న సమయంలో జనసమీకరణకు అంగీకరించబోమని తెలిపారు.

అటు, చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ, ఐదు వేల మందితో ధర్నా చేపడుతున్నట్టు గతరాత్రి టీడీపీ నేతలు లేఖ ఇచ్చారని, అనుమతి ఇవ్వలేమని తాము అప్పటికప్పుడే స్పష్టం చేశామని వెల్లడించారు. నగరం వెలుపల ధర్నా చేసుకుంటే అభ్యంతరం లేదని చెప్పామని, అయితే టీడీపీ నేతలు నగరంలో ధర్నాకు సిద్ధపడడంతో కొందరిని అరెస్ట్ చేశామని చెప్పారు.

More Telugu News