POSCO: తిరుమల ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.9 కోట్ల విరాళం ఇచ్చిన పోస్కో

  • స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో తెరపైకి పోస్కో పేరు
  • ఇవాళ శ్రీవారిని దర్శించుకున్న పోస్కో సీఈఓ
  • విరాళం డీడీలు టీటీడీ అదనపు ఈవోకు అందజేత
POSCO donates huge amount to SVBC TRust

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో పోస్కో కంపెనీ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు పరిశ్రమ మిగులు భూముల్లో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పోస్కో ఆసక్తి చూపుతోంది. ఈ అంశంలో అధికార వైసీపీకి, విపక్ష టీడీపీకి మధ్య విమర్శల పర్వం కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో పోస్కో సంస్థ తిరుమల వెంకన్నకు భారీ విరాళం ప్రకటించింది.

తిరుమల ఎస్వీబీసీ ట్రస్టుకు పోస్కో సంస్థ సీఈఓ సంజయ్ పాసి రూ.9 కోట్ల విరాళం అందించారు. ఇవాళ ఉదయం సతీసమేతంగా శ్రీవారి దర్శనం చేసుకున్న సంజయ్ పాసి, ఆపై విరాళం తాలూకు డీడీలను టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. అంతకుముందు ఆయనకు ఆలయ పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్థప్రసాదాలు అందించారు.

More Telugu News