Virat Kohli: గ్రౌండ్ లోకి పరిగెత్తుకుంటూ వచ్చిన అభిమాని... దూరంగా ఉండాలని వారించిన కోహ్లీ.. వీడియో ఇదిగో!

  • అహ్మదాబాద్ లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్
  • నిబంధనలను అతిక్రమించిన అభిమాని
  • బయో బబుల్ ను గుర్తు చేసిన కోహ్లీ
Kohli Guesture after A Fan Breach Protocal

అహ్మదాబాద్ లో నూతనంగా నిర్మించిన నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా, ఇంగ్లండ్ మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ ఆటగాడు అతన్ని కలిసేందుకు సెక్యూరిటీ వలయాన్ని దాటుకుని మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే, బయో బబుల్ లో ఉన్న కోహ్లీ, అతన్ని దూరంగా ఉండాలంటూ సున్నితంగా వారించాడు.

అతని నుంచి దూరంగా జరుగుతూ, చేతులతోనే దగ్గరకు రావద్దంటూ సైగలు చేశాడు. దీంతో తన తప్పును తెలుసుకున్న ఆ అభిమాని, అంతే వేగంతో వెనక్కు వెళ్లిపోయాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా తిలకించిన దాదాపు 50 వేల మందికి పైగా క్రికెట్ ప్యాన్స్ తో నిండివున్న మైదానం కేరింతలు కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

కాగా, బయో బబుల్ ప్రొటోకాల్ ప్రకారం, ఆటగాళ్లు అత్యంత కఠిన నిబంధనల మధ్య ఉండాలి. పరిమిత వాతావరణంలోనే, ఇతర ఆటగాళ్లతో కలసి వారుండాలి. బయటి వ్యక్తిని ఎవరినైనా కలవాలంటే, వారు కరోనా పరీక్షలు, పరిమిత రోజుల క్వారంటైన్ తరువాత మాత్రమే అవకాశం ఉంటుంది. ఎవరైనా బయటి వ్యక్తిని కలిస్తే, ఆపై సదరు ఆటగాడు మరోసారి క్వారంటైన్ కావాల్సి వుంటుంది.

ఇక జరిగిన ఘటనపై గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ స్పందించింది. నిబంధనలను అతిక్రమించిన ఆ అభిమాని ఎవరన్న విషయమై విచారణ జరుగుతోందని, ఆటగాళ్ల భద్రత తమకు అత్యంత ముఖ్యమని వ్యాఖ్యానించింది. నిబంధనలను అతిక్రమిస్తే, చర్యలు తప్పవని హెచ్చరించింది.

More Telugu News